Somu Veerraju: కడపలో ఎయిర్ పోర్ట్ అంట.. ప్రాణాలు తీసే వాళ్ల జిల్లాలో ఎయిర్ పోర్టా..? వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు అంటూచేసిన వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
‘రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే క్రమంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను.
నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన’ అంటూ సోమువీర్రాజు చెప్పుకొచ్చారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ.. బహిరంగంగానూ పలు సంఘాలు పార్టీలవారు ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో ఈమేరకు క్షమాపణలు చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.