MLA Sridhar Reddy: నారా లోకేశ్ మంగళగిరి పేరునూ సక్రమంగా పలకలేరు: ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు
ఆంధ్ర పప్పు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ముందు లోకేశ్ పేరే కనబడుతుందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. దుద్దుకుంట అంటే ఒక బ్రాండ్ అని, తనను దోపిడీ కుంట అంటావా? అని నిలదీశారు.
- T Venkateshwarlu
- Updated on- March 26, 2023 / 04:00 PM IST
Duddukunta Sreedhar Reddy
MLA Sridhar Reddy: నిన్న ఓబులదేవరచెరువు బహిరంగ సభలో తనపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ పై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లాలో శ్రీధర్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… సొంత నియోజకవర్గం మంగళగిరి పేరు కూడా సక్రమంగా పలకలేని నారా లోకేశ్ కు రాజకీయాలు ఎందుకని అన్నారు. ఆంధ్ర పప్పు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ముందు లోకేశ్ పేరే కనబడుతుందని చెప్పారు. దుద్దుకుంట అంటే ఒక బ్రాండ్ అని, తనను దోపిడీ కుంట అంటావా? అని నిలదీశారు.
“నీ తండ్రిలా అడ్డగోలుగా సంపాదిస్తే నేను పైకి రాలేదు.. కష్టపడి పైకొచ్చిన వాడిని.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సత్యసాయిబాబా పేరు కూడా నీకు సక్రమంగా పలకడం రాదు. పల్లె రఘునాథ్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగునరేళ్ళలో పుట్టపర్తి అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమే. ప్లేస్, టైం నువ్వే డిసైడ్ చేసుకో ఎక్కడికి రమ్మన్నా వస్తాను” అని శ్రీధర్ రెడ్డి అన్నారు.
కాగా, లోకేశ్ పాదయాత్రలో భాగంగా ఓబులదేవర చెరువులో పర్యటించారు. ఆయన పాదయాత్ర 50 వ రోజుకి చేరుకుంది. మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి… లోకేశ్ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక వైసీపీ నేతలు మండిపడుతున్నారు. లోకేశ్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతున్నారు.
