జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో స్వామీజీల సమావేశం.. ఏమన్నారంటే?
స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ.. జగన్ పట్ల స్వామీజీలకు కోపం లేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో తిరుమల ఆచారాన్ని జగన్ కాపాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Harishth Thanniru
- Published On : September 27, 2024 / 01:50 PM IST
YS Jagan
YS Jagan Tirupati Tour: తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఎన్డీయే కూటమి పార్టీల్లోని నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. దీంతో జగన్ డిక్లరేషన్ విషయంపై చర్చ జరుగుతుంది. తాజాగా తిరుపతిలో స్వామీజీలు సమావేశం అయ్యారు. ‘సేవ్ తిరుమల సేవ్ టీటీడీ’ పేరుతో ఈ సమావేశం జరిగింది. స్వామీజీలు, జనసేన తిరుపతి ఇన్ ఛార్జి కిరణ్ రాయల్ పాల్గొన్నారు.
Also Read : YS Jagan: వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే.. పార్టీ నేతలకు కీలక ఆదేశాలు
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని సమావేశంలో స్వామీజీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. జగన్ డిక్లరేషన్ విషయం టీటీడీ చూసుకుంటుంది. జగన్ ను మేము అడ్డుకోము. జగన్ తిరుపతి పర్యటన శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే.. రాజకీయ లబ్ధికోసమేనని కిరణ్ అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణకోసం ప్రాణాలనుకూడా పణంగా పెడతానన్న పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు శక్తి. జగన్ పట్ల స్వామీజీలకు కోపం లేదు. అయితే, గత ఐదేళ్లలో తిరుమల పవిత్రతను కాపాడలేదు. తిరుమల ప్రాశస్త్యం పట్ల జగన్ కు గౌరవం లేదు. గత ఐదేళ్లు సీఎంగా ఉండి డిక్లరేషన్ ఇవ్వలేదు. తిరుమల ఆచారాన్ని జగన్ కాపాడలేదు. జగన్ ది క్రూయల్ మెంటాలిటీ అని చాలా మంది అంటున్నారు. తిరుమలకు వచ్చి మరో డ్రామాకు జగన్ తెరతీసే అవకాశం ఉందని శ్రీనివాసానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.
