ఒకే రోజు 10 లక్షల కోళ్లు మృతి.. ఉన్నట్టుండి మెడ వేలాడేస్తున్న కోళ్లు.. ఏపీలో ఏం జరుగుతోంది?
Andhra Pradesh : ఏపీలో భారీగా పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలులు కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో పది లక్షల కోళ్లు మృత్యవాత పడ్డాయి.
- Harish Thanniru
- Updated on- May 25, 2026 / 10:12 AM IST
million chickens died
- ఏపీలో 48డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు
- ఎండల తీవ్రతకుతోడు తీవ్రస్థాయిలో వడగాలులు
- వేడికి పౌల్ట్రీల్లో భారీగా చనిపోతున్న కోళ్లు
- ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 10లక్షల కోళ్లు మృతి
Andhra pradesh : ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకుతోడు వేడిగాలులతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఫౌల్ట్రీ ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉన్నట్లుండి కుప్పకూలిపోయి చనిపోతుండటంతో పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది.
ఏపీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లోనే అత్యధికమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీలో భారీగా పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలులు కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వేసవి వేడి తట్టుకోలేక గత కొన్ని రోజుల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల కోళ్లు మృత్యువాత పడటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు లక్షలకుపైగా కోళ్లు మరణించాయి. దీంతో కోడి గుడ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా గడిచిన వారంరోజుల్లో దాదాపు 18 నుంచి 20 లక్షల కోళ్లు చనిపోయినట్లు పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విపరీతమైన వేడి వల్ల బతికున్న కోళ్లు కూడా సరిగా మేత తినడం లేదని పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుండి 48 డిగ్రీల వరకు నమోదు కావడమే ఈ దారుణ పరిస్థితికి ప్రధాన కారణంగా పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎండలు బర్డ్ఫ్లూ వైరస్ కంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
