Atchannaidu slams AP police: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్ అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి నేత, కార్యకర్తకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం పోలీసులు డ్యూటీలో భాగం అనుకుంటున్నారా? లేక ఫ్యాషన్ అనుకుంటున్నారా? అని ఆయన ఓ ప్రకటనలో నిలదీశారు. కార్యకర్తల కన్నీళ్ళకు కారణమైన ఖాకీలను, వైసీపీ నేతలను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.
సీఎం జగన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, చట్టాలను ధిక్కరిస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని వ్యవస్థలు అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష నేతుల, కార్యకర్తలను వేధిస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. మూడు ఏళ్ళలో ఎంత మందిపై అక్రమ కేసులు పెట్టారో, ఎంత మందిని జైలుకు పంపారో లెక్కలేదని ఆయన అన్నారు.
వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ అరాచకాలకు కొందరు పోలీసులు, పోలీసులు వంత పాడడం దుర్మార్గమని అన్నారు. వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని, థర్డ్ డిగ్రీలతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు.
కాగా, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపేవారిని పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. సీఆర్పీసీ 41ఏ నోటీసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. నోటీసులు ఇవ్వటానికి వచ్చామంటూ అర్ధరాత్రి వెళ్ళి తమ కార్యకర్తల తలుపులు విరగ్గొట్టి ఇళ్ళలోకి వెళ్తున్నారని చెబుతున్నారు.