జూన్ 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి దర్శనం భక్తులకు కల్పిస్తామని దేవస్ధానం ఈవో సురేశ్ బాబు తెలిపారు. రూ.300 టికెట్లు రద్దు చేశామని, తీర్థాలు, శఠగోపాలు ఉండవని చెప్పారు. ప్రసాదాలు నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఇస్తామన్నారు.
సోమ మంగళవారాలు దర్శనాల ట్రయల్ రన్ ఉంటుందని ఈవో పేర్కొన్నారు. 10 వ తేదీ నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తామని…మహామండపం ద్వారానే దర్శనం చేసుకుని భక్తులు కిందకు రావాలని సూచించారు. భక్తులు కరోనా నివారణ సూచనలు పాటిస్తూ ఆలయ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఈవో సురేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.
మరో వైపు….. చినతిరుపతిగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారాకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. 8,9 తేదీల్లో దేవస్థానం సిబ్బంది, స్థానిక భక్తులతో ట్రయిల్ రన్ నిర్వహిస్తామని… 10 నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుందని చెప్పారు.
10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి, 65 సంవత్సరాలు పైబడిన పెద్ద వాళ్లకు దర్శనానికి అనుమతించమని ఈఓ అన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని ఈవో తెలిపారు. ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం7 గంటల వరకు దర్శనం కొరకు తెరిచి ఉంటుందని ఆయన వివరించారు.