The AP Government Employees Union : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని, ఆ భయాందోళనతో చాలామంది సెలవులో ఉన్నారని తెలిపింది. ఉద్యోగులను ఒత్తిడికి గురిచేసేలా ఎన్నికలకు వెళ్లడం సరికదాన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికల నిర్వహణ వాయిదా వేయాలన్నారు. రెండేళ్ల నుంచి ప్రత్యేక అధికారుల పాలనే ఉందని, ఇప్పుడు ఉద్యోగులను వేధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇప్పటిదాకా 11వేల మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారని తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై రెండు రోజులు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చు అని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్పై హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ ముగించి తీర్పును ఇచ్చింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా.. నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు.. ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది.