×
Ad

Tirumala Parakamani Case: తిరుమల పరకామణి కేసులో సంచలనం.. ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి.. రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీ..

గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిన వాళ్లు ఏమైనా చేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పరకామణి కేసులో ఉన్న ఇతర సాక్షులకు వెంటనే రక్షణ కల్పించాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • Published On : November 14, 2025 / 03:21 PM IST

Tirumala Parakamani Case: రాష్ట్రంలో దుమారం రేపిన తిరుమల పరకామణి కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర రైల్వే ట్రాక్ పై సతీష్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారా? ఆయనను హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. టీటీడీలో సంచలనం రేపిన పరకామణి కేసులో ఇటీవలే ఆయన సిట్ ముందుకు హాజరయ్యారు. ఇంతలోనే ఇలా రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించడం సంచలనంగా మారింది.

టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. సతీష్ కుమార్ మరణం బాధాకరం అన్నారు. ఆయనను ఎవరైనా బెదిరించారా? లేక పన్నాగంతో ఇలా చేశారా? అన్నది తేలాలన్నారు. ఈ ఘటన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిన వాళ్లు ఏమైనా చేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పరకామణి కేసులో ఉన్న ఇతర సాక్షులకు వెంటనే రక్షణ కల్పించాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీని గుర్తించి కేసు పెట్టించింది అప్పటి ఏవీఎస్ వో సతీశ్ కుమారే. సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ హుండీ సొమ్ము చోరీ చేస్తుండగా గుర్తించిన సతీశ్ కుమార్.. 2023లో ఫిర్యాదు చేశారు.

తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు, మాజీ AVSO సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. తాడిపత్రి రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహం కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సతీశ్ ఫిర్యాదుతోనే సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌పై 2023 మేలో విజిలెన్స్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. లోక్‌ అదాలత్‌లో రాజీతో ఆయన టీటీడీకి కొన్ని ఆస్తులు అప్పగించారు. దీనిపై పిటిషన్‌ దాఖలు కాగా హైకోర్టు ఆదేశాలతో సీఐడీ విచారిస్తోంది. ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. అధికార టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది.

Also Read: ఐయామ్ సారీ.. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్‌ పశ్చాత్తాపం వెనుక కారణం ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?