Tirumala
Troop exploitation in Thirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ వెబ్ సైట్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ కొంత మంది భక్తులు ఇంకా దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో దళారులు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. ఓ దళారి రూ.300ల దర్శనం టిక్కెట్ ను రూ.4,400 కు విక్రయించాడు. తిరుమలలో నకిలీ టిక్కెట్ల వ్యవహారం మరోసారి కలకలం రేపడంతో విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన భక్తులకు మార్ఫింగ్ చేసిన టిక్కెట్లను దళారీ విక్రయించాడు. రూ.600లు విలువ చేసే రెండు టిక్కెట్లను ఏకంగా రూ.8,800లకు అమ్మేశాడు.
అయితే రోజూ రూ.300ల దర్శనానికి చెల్లించే టిక్కెట్ల కంటే ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవడంతో టీటీడీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు అనుమానం కలిగింది. దీంతో నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుల వద్ద నకిలీ టిక్కెట్లను గుర్తించడంతో మార్ఫింగ్ టిక్కెట్ల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు చేపట్టారు. ఇదంతా తిరుపతిలోని ట్రావెల్స్ నిర్వహకులు పనిగా అనుమానిస్తున్నారు. కరోనా కాలంలో అక్రమార్కులు తీరు మార్చుకోవడం లేదు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల కొండెక్కే భక్తులను దోచేస్తున్నారు.
కరోనా నిబంధనలతో రూ.300ల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో టీటీడీ తక్కువ సంఖ్యలో ఇస్తోంది. మరోవైపు సిఫార్సు లేఖలను సైతం తక్కువ సంఖ్యలో అనుమతిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు రెచ్చిపోతున్నారు. 17 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్, సెంట్రల్ బస్ స్టాండ్, అలిపిరి లింక్ బస్టాండ్ లు దళారుల అడ్డగా మారింది.
ఏడాదిన్నర కాలంలో కరోనా వ్యాప్తి, మధ్యలో అమలైన లాక్ డౌన్, కర్ఫ్యూలతో ఉపాధి కోల్పోయిన వారంతా దళారుల అవతారమెత్తారు. మరోవైపు ఈ మధ్య కాలంలో ఈ దందా మొదలు పెట్టాయి. శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసి 30 మంది ట్యాక్సీ డ్రైవర్లను ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. చెన్నై కేంద్రంగా శ్రీవారి టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న రేవతి ట్రావెల్స్ పై ఇటీవలే పోలీస్ కేసు నమోదు అయింది. టిక్కెట్లను మార్ఫింగ్ చేయడం, నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించడం, కల్పిత మెసేజులను భక్తులకు వాట్సాప్ చేయడం వంటివి దళారులకు వచ్చు.
మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలను నకిలీవి సృష్టించి వాటిపై శ్రీవారి దర్శనాలను చేయించిన ఘనత దళారులకు ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం సిఫార్సు లేఖలు 36, అంబర్ పేట ఎమ్మెల్యే సిఫార్సులపై 23, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17, ఎంపీ కోటాలో 11 టిక్కెట్లను దళారులు పొందారు. ఏపీ ప్రస్తుత హోంమంత్రి, మాజీ హోంమంత్రి సిఫార్సు లేఖలపై టిక్కెట్లు పొంది బ్లాక్ లో అమ్మిన ఉదంతాలు ఉన్నాయి. ఇటీవల ఫేక్ టిక్కెట్లు, ఫేక్ సిఫార్సు లేఖలు ఎక్కువగా వెలుగు చూస్తుండటంతో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిఘా పెట్టారు.