TTD Board Key Decisions: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. రూ.4 కోట్లతో నిర్మాణాలు
తిరుమలలో నీటి వృథాను అరికట్టేందుకు గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల రూపాయలతో దాదాపు 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్ లైన్ ఏర్పాటునకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
- Naveen
- Updated on- May 6, 2026 / 07:41 PM IST
TTD Board Key Decisions: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుంచి బాట గంగమ్మ సర్కిల్ వరకున్న సర్వ దర్శనం క్యూలైన్లలో 4 కోట్ల 55 లక్షల రూపాయలతో అదనపు టాయిలెట్లు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. తిరుమలలోని రోడ్లు, ప్రధాన వీధులకు కమిటీ సూచించిన ఆధ్యాత్మిక, పురాణ ప్రాశస్త్యం కలిగిన 51 పేర్లను పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ విద్యా సంస్థల్లో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటునకు అదనంగా 43 కోట్ల 40 లక్షల రూపాయల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమలలో నీటి వృథాను అరికట్టేందుకు గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల రూపాయలతో దాదాపు 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్ లైన్ ఏర్పాటునకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
టీటీడీ అవసరాల కోసం ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకి చెందిన కో ఆప్టెక్స్ ద్వారా పట్టువస్త్రాలు, దుప్పటాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇక శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం కోయంబత్తూర్ లో ఇచ్చిన 3 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని బోర్డు నిర్ణయించింది.
