TTD Board Members : ఆ ముగ్గురినీ తొలగించండి.. టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలపై హైకోర్టులో పిటిషన్‌

నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడం కరెక్ట్ కాదు. TTD Board Members Controversy

  • Published On : August 28, 2023 / 08:26 PM IST

TTD Board - High Court

TTD Board Members Controversy : ఇటీవల ఏపీ ప్రభుత్వం టీటీడీ నూతన పాలకమండలని ప్రకటించింది. 24మందితో సభ్యులతో జాబితాను విడుదల చేసింది. అది మొదలు.. వివాదం మొదలైంది. బోర్డు సభ్యులుగా ఎంపిక చేసిన వ్యక్తులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వివిధ కేసుల్లో ఉన్న వ్యక్తులను, నేరచరిత్ర కలిగిన వారిని బోర్డు సభ్యులుగా నియమించడం ఏంటని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. సీఎం జగన్ తిరుమల పవిత్రను, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడుతున్నారు.

తాజాగా ఈ వ్యవహారం కోర్టుకి చేరింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలు సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరమ పవిత్రంగా భావించే పాలకమండలిలో నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడం మంచి పద్ధతి కాదంటూ చింతా వెంకటేశ్వర్లు కోర్టులో పిటిషన్ వేశారు.

బోర్డు మెంబర్లుగా క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్ గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని న్యాయాస్థానాల ద్వారా తొలగించబడిన కేతన్ దేశాయ్, లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ చంద్రారెడ్డి నియామకాలు సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు. వెంటనే ఈ ముగ్గురిని బోర్డు మెంబర్లుగా తొలగించాలని పిటిషన్ లో కోరారు పిటిషనర్.

Also Read..Pamarru Constituency: ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి?

టీటీడీ కోట్లమంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉందన్న పిటిషనర్.. నేరచరిత్ర, క్రిమినల్ కేసులు ఉన్న వారిని సభ్యులుగా నియమించడం సరికాదన్నారు. టీటీడీ ట్రస్టీలుగా నియమించబడిన వారు కళంకితులై ఉండకూడదన్నారు పిటిషనర్. బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. పిటిషనర్ తరుపు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించనున్నారు.

టీటీడీ బోర్డు సభ్యులుగా ప్రభుత్వం ఎంపిక చేసిన వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలు కేసుల్లో ఉన్న వ్యక్తులను, నేరచరితులను బోర్డు సభ్యులుగా నియమించడం దారుణం అంటున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా ఇద్దరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకుని అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి, గుజరాత్ కు చెందిన కేతన్ దేశాయిలకు టీటీడీ పాలక మండలిలో చోటు కల్పించడంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏడో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి.. జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా గుజరాత్‌కు చెందిన కేతన్ దేశాయ్‌ పై కూడా పలు కేసులు ఉన్నాయి. గుజరాత్ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయనపై 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రెండు కేసుల్లో కేతన్ నిందితుడిగా ఉన్నారు. కేసులున్న కేతన్ దేశాయ్‌ను టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎలా నియమిస్తాంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read..Anitha Vangalapudi : తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే అంతే.. సీఎం జగన్‌కి వంగలపూడి అనిత సీరియస్ వార్నింగ్

బోర్డు సభ్యులపైనే కాదు.. టీటీడీ ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్‌ రెడ్డిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. భూమన క్రిస్టియన్, నాస్తికుడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇవ్వడం ఏంటని సీరియస్ అవుతున్నాయి. పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ పై ఫైర్ అవుతున్నారు టీడీపీ, బీజేపీ నేతలు. తీహార్‌ జైల్లో ఉన్న వారితో టీటీడీ పాలక మండలి జాబితా తయారు చేశారా? ఆర్థిక నేరాల్లో జైలుకి వెళ్లొచ్చిన వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారు? అని నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. వెంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు అని స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇస్తున్నారు.