Tirumala: అలా చేయొద్దు.. తిరుమల కొండపైకి నడక మార్గంలో ప్రయాణించే భక్తులకు టీటీడీ కీలక సూచన..
కాలినడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశారు.
- Harishth Thanniru
- Published On : August 20, 2023 / 01:54 PM IST
TTD
TTD: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నడక మార్గంలో కొండపైకి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ విజ్ఞప్తి చేసింది. నడక మార్గంలో చిరుత, ఎలుగు బంట్లు సంచారంపై వందతులు సృష్టించొద్దని పేర్కొంది. చిరుత, ఎలుగు బంటి సంచారంపై అటవీశాఖ అధికారుల సమక్షంలో కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు టీటీడీ అటవీశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాలిబాట భక్తులకు అటవీ అధికారులు సూచనలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న చోట రెస్క్యూ బృందాలనుసైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎలుగు బంట్లు, చిరుత పులులకు శేషాచలం ఆవాసంగా ఉన్నాయని, వాటి నుంచి కాలినడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు నడక మార్గంలో కొండపైకి వెళ్తున్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పగలు, రాత్రి సమయాల్లో గుంపులుగా వెళ్లాలని కోరారు. చిరుత, ఎలుగు బంటి సంచారంపై తప్పుడు వదంతులు వ్యాప్తిచేయొద్దని భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Tirumala : తిరుమలలో చిక్కిన చిరుత.. బాలికపై దాడిచేసిన ప్రాంతానికి దగ్గర్లోనే బోనులోకి
తిరుపతి కొండపైకి కాలినడక మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత పులులు, ఎలుగు బంట్ల సంచారం పెరగడంతో పాటు దాడి చేస్తుండటంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అలిపిరి కాలినడక దారిలో చిరుత దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరుతలను పట్టుకొనేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుతలను బంధించేందుకు కాలినడక మార్గంలో మూడు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. ఈ క్రమంలో ఆగస్టు 14న బోనులో ఓ చిరుత చిక్కగా, ఆగస్టు 17న తెల్లవారు జామున మరో చిరుత చిక్కింది. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలను బంధించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. జూన్ 24న ఓ చిరుతను, ఆగస్టు 14న రెండో చిరుతను, ఆగస్టు 17న మూడో చిరుతను బంధించారు.
Operation Cheetah : 500 ట్రాప్ కెమెరాలు, 100మంది సిబ్బంది.. తిరుమలలో ముమ్మరంగా ఆపరేషన్ చిరుత
మరోవైపు కాలినడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశారు. శ్రీశైలం – నల్లమల నుంచి తిరుపతికి వచ్చిన ప్రత్యేక అటవీ అధికారుల బృందం కెమెరాలను బిగిస్తోంది. త్వరలో శేషాచలానికి మరిన్ని అధునాతన బోన్లు కూడా రానున్నాయి. అటు నంద్యాల నుంచి 10వేల ఊతకర్రలను టీటీడీ తెప్పించనుంది. కొండపైకి కాలినడక మార్గంలో వెళ్లేవారికి ఊత కర్రలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
