Palnadu Crime: పల్నాడులో దారుణం.. పట్టపగలే ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి.. రాడ్డుతో కొట్టి, గొంతు కోసి..
పల్నాడు (Palnadu Crime)జిల్లా పెదకూరపాడు మండలంలో పట్టపగలే అత్యంత దారుణమైన ఘాతుకం చోటుచేసుకుంది.
- V Santhosh Kumar
- Published on- August 5, 2026 / 01:51 PM IST
Unidentified miscreants brutal attack on a couple in Pedakurapadu, Palnadu.
- పల్నాడులో దంపతులపై దారుణ దాడి
- మహిళ గొంతు కోసిన దుండగులు
- సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స
Palnadu Crime: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో పట్టపగలే అత్యంత దారుణమైన ఘాతుకం చోటుచేసుకుంది. గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందేలా దుండగులు బరితెగించి ఒక ఇంట్లోకి చొరబడ్డారు. బుచ్చయ్యపాలెం వెళ్లే రహదారిలోని స్థానిక ఆంజనేయ స్వామి బొమ్మ సెంటర్లో నివాసముంటున్న అవ్వారు బాల గురవయ్య, అరుణ దంపతులను లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతకానికి ఒడిగట్టారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆధార్ కార్డు అడిగే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి ఈ దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రాడ్డుతో బాది, మహిళ గొంతు కోసి పరారీ:
అపరిచితులు ఇంట్లోకి రావడంతో అనుమానం వచ్చిన అరుణ (50) ‘ఎవరు మీరు?’ అని ప్రశ్నించింది. (Palnadu Crime)దీంతో ఆగ్రహానికి గురైన ఆ దుండగులు వెంటనే తమ వద్ద ఉన్న ఇనుప రాడ్డుతో బాల గురవయ్య తలపై తీవ్రంగా బాదారు. భర్తపై దాడిని అడ్డుకుని ప్రతిఘటించిన అరుణపై కత్తితో దాడి చేసి గొంతు కోసి అక్కడికక్కడే తీవ్రంగా గాయపరిచారు. రక్తమడుగులో పడివున్న దంపతులను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దుండగులు వేగంగా బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు.
ఆసుపత్రికి తరలింపు, రంగంలోకి దిగిన పోలీసులు:
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాల గురవయ్యను, అరుణను స్థానికుల సాయంతో పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దుండగులు ఏ కారణంతో దాడికి పాల్పడ్డారు? దొంగతనానికి వచ్చి చేశారా లేదా పాత కక్షలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
