Srinivasa Varma: అక్కడ రామాలయం ఉంది, ఆలయం పునర్ నిర్మాణంలో వెనకడుగు వేసేది లేదు- కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

రామాలయాన్ని అడ్డుకోవడం సమంజసం కాదు. మత మార్పిడులు జరిగినా పురాతన రామాలయ చరిత్ర, పవిత్రత, సంస్కృతి మారవు.

  • Published On : March 29, 2026 / 12:25 AM IST

 

Srinivasa Varma: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేట రామాలయ స్థల వివాదంపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ స్థలం వివాదాస్పదం కానే కాదన్నారు. అక్కడ రామాలయం, రాముడి విగ్రహాలు ఉన్నాయన్నారు. ఆలయ పునర్ నిర్మాణంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రామాలయ నిర్మాణ రాజకీయ ఆలోచన కాదన్న శ్రీనివాస వర్మ.. నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. కూటమి నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, పోలీసుల సూచన మేరకు రామాలయం సందర్శనను విరమించుకున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.

”పెదపేటలో రామాలయ నిర్మాణానికి అందరూ సహకరించాలి. రామాలయాన్ని అడ్డుకోవడం సమంజసం కాదు. మత మార్పిడులు జరిగినా పురాతన రామాలయ చరిత్ర, పవిత్రత, సంస్కృతి మారవు. పెదపేటలో రామాలయ స్థలం వివాదాస్పదం కాదు. అక్కడ రామాలయం ఉంది. రాముని విగ్రహాలు ఉన్నాయి. వాటిని పునర్ నిర్మించాలన్నదే మా ఆలోచన.

రామాలయం పునర్నిర్మాణ విషయంలో ఎటువంటి రాజకీయ లబ్ధి అవసరం లేదు. రామాలయ నిర్మాణం రాజకీయ ఆలోచన కాదు. క్షణికావేశంలో దాడి చేసిన వారు పునరాలోచన చేసుకుని రామాలయ నిర్మాణానికి ముందుకు రావాలి. బయట వ్యక్తుల ప్రోత్సాహం వలన దాడి జరిగిందని భావిస్తున్నాము. దాడికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణలో బయటపడతాయి. రామాలయం పునర్నిర్మాణంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సూచనలు మేరకు రామాలయం సందర్శన విరమించుకున్నా” అని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.

కాగా, శ్రీరామనవమి సందర్భంగా కాగా పెద్దపేటలోని రామాలయంలో పూజలు చేసేందుకు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు వెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఓ వర్గం ప్రజలు ఆందోళనకు దిగాయి. శిథిలావస్థకు చేరిన ఆలయం స్థానంలో కొత్త గుడిని కట్టిస్తామని రఘురామ ఇటీవల ప్రకటించారు. అయితే ఆ ప్రాంతంలో గుడి నిర్మించవద్దని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. గుడిలో పూజ చేసేందుకు వచ్చిన రఘురామను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు జనసేన నాయకులపై మేకుల కర్రలు, చాకులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం సంచలనం రేపింది. ఈ దాడి ఘటనతో పెద్దపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.