vallabhaneni vamsi: వల్లభనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలుకు తరలింపు.. వంశీ సతీమణి పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యే, గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
- Harishth Thanniru
- Published On : February 14, 2025 / 08:24 AM IST
vallabhaneni vamsi Arrest
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే, గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఉండగా వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. పోలీసు భద్రత మధ్య హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. గురువారం మధ్యాహ్నం 1గంట సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వంశీని తరలించిన పోలీసులు.. దాదాపు ఎనిమిది గంటలపాటు అతన్ని ప్రశ్నించారు.
టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, దాడి చేశారన్న అభియోగంపై వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేయగా.. శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు. వీరిపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ వాగ్మూలంను పోలీసులు నమోదు చేశారు. వంశీ, అతని అనుచరులను విచారణ అనంతరం విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడ ఫోర్త్ ఏసీఎంఎం జడ్జి ఎదుట రాత్రి 10.30 గంటలకు హాజరుపర్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ అర్ధరాత్రి 2.30గంటలకు వంశీకి, అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ లకు 14రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో వారిని శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
Also Read: Vallabhaneni Vamsi Arrest : వంశీని ఎలిమినేట్ చేయాలని చూశారు- అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
వల్లభనేని వంశీ అరెస్టుపై అతని సతీమణి పంకజశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు.. నేను టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుంచి కనీసం కాపీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్టు చేశారో..? ఏ కేసులో అరెస్టు చేశారో ఇప్పటికీ పోలీసులు చెప్పలేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వడం లేదని పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. వంశీ అరెస్టుపై హైకోర్టుకు కచ్చితంగా వెళ్తాం.. న్యాయపరంగానే ఎదుర్కొంటామని పంకజశ్రీ పేర్కొన్నారు.
