Kanaka Durga Temple : దసరాకి బెజవాడ దుర్గమ్మను దర్శించుకోవాలనుకుంటున్నారా.. టికెట్లు రిలీజ్.. వాట్సాప్ లో ఇలా బుక్ చేసుకోండి..
ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్లైన్లో ఆర్జిత సేవలు చేయించుకునేందుకు రూ.1500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చు.
- Harishth Thanniru
- Published On : September 15, 2025 / 12:38 PM IST
Kanaka Durga Temple
Kanaka Durga Temple : విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను ఈవో శీనానాయక్ ఆన్లైన్లో విడుదల చేశారు. ప్రభుత్వ వాట్సాప్ సేవల నెంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్లైన్లో ఆర్జిత సేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చునని అన్నారు.
దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీయాగం టికెట్లను ఈవో శీనానాయక్ ఆదివారం విడుదల చేశారు.
ఖడ్గమాలార్చన ఈనెల 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పదిరోజుల పాటు ఒక షిప్టు మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహించే ఖడ్గమాలార్చనకు రుసుం రూ.5,116చెల్లించాల్సి ఉంటుంది.
22వ తేదీ దసరా ప్రారంభం రోజున అమ్మవారికి స్నపన కార్యక్రమం ఉన్నందున ఆరోజు ఖడ్గమాలార్చన ఉండదు. ప్రత్యేక కుంకుమార్చనకు మూలా నక్షత్రం రోజున రూ.5వేలు రుసుం చెల్లించాలి. మిగతా అన్ని రోజులు రూ.3వేల చొప్పున రుసుం చెల్లించాలి. దసరా ప్రారంభం రోజున ఉదయం 9గంటల నుంచి మాత్రమే నిర్వహిస్తారు.
ప్రత్యేక చండీయాగం ఉదయం 9గంటల నుంచి ఒక షిప్టు మాత్రమే నిర్వహిస్తారు. రుసుం రూ.4వేలు చెల్లించాలి. ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తులు ఇరువురిని ముఖమండపం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. రుసుం చెల్లించిన భక్తులు పూజలో పాల్గొనేందుకు సంప్రదాయ వస్త్రధారణలోనే రావాలి. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
ఉదయం 3.30 నుంచి 10.30 గంటల వరకు వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ లో, గట్టు వెనుక భవానీ ఘాట్ లో దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. సొంత వాహనాలను అనుమతించరు. దీంతోపాటు వెబ్ సైట్ లోను పరోక్ష టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
వాట్సాప్లో ఇలా బుక్ చేసుకోండి..
♦ వాట్సాప్లో ఈ నెంబర్ 95523 00009 కు హాయ్ అని మెస్సేజ్ చేయండి.
♦ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ను ఎంచుకొని విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని ఆలయ దర్శనం, టెంపుల్ సేవ, టెంపుల్ డొనేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
♦ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఏది కావాలంటే అందులో ఎంచుకోవచ్చు.
♦ ఉదాహరణకు అష్టోత్తర నామార్చన సేవను బుక్ చేసుకుంటే టైం స్లాట్ ఎంచుకోవాలి.
♦ ఆపై కంటిన్యూ బటన్ నొక్కి ఎంత మంది హాజరవుతారు, ఆధార్ లేదా ఇతర ఐడీ వివరాలు, గోత్రం, పుట్టిన తేదీ ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
♦ నెక్ట్స్ స్క్రీన్ పై వ్యక్తులు, పూజ, రుసుము, వివరాలు సరిచూసుకొని కన్ఫర్మ్ నొక్కితే పేమెంట్ ఆప్షన్ వస్తోంది.
♦ నగదు చెల్లించి వాట్సాప్ ద్వారా వచ్చే టిక్కెట్ను ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
