Sai Krishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్.. వెలుగులోకి కీలక సూత్రధారులు
Sai Krishna Death Case: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- June 25, 2026 / 03:56 PM IST
Vijayawada sai krishna lockup death case key developments and sit investigation updates
- సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.
- సీఐ కస్టడీ కోరిన సిట్.
- ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు.
Sai Krishna Lockup Death: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాయికృష్ణ కస్టోడియాల్ టార్చర్(Saikrishna Lockup Death) (పోలీస్ నిర్బంధంలో హింస) వల్లే మరణించినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గుర్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తుకు సీఐ నాగరాజు పూర్తిగా సహకరించడం లేదని, అందువల్ల ఈ కస్టడీ పిటిషన్పై కోర్టు నేడు విచారణ జరిపి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
సాయికృష్ణ మరణానికి సంబంధించిన ఆధారాలను, మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సీఐ నాగరాజు పాత్రపై పూర్తి వివరాలను రాబట్టేందుకు సిట్ అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణలంక మహిళా ఎస్సై హిమజ స్టేట్మెంట్ను సిట్ ఇప్పటికే రికార్డు చేసింది. ఈ సంచలన కేసులో ఇప్పటివరకు మొత్తం 17 మందిని అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే, ఈ ఘాతుకానికి పాల్పడిన మరికొందరి పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది.
ఈ దారుణంలో సీఐ నాగరాజుతో పాటు ఆయన సన్నిహితులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాత్రపై కూడా సిట్ నిఘా పెట్టింది. ముఖ్యంగా, సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో సీఐ నాగరాజుకు అత్యంత సమీప బంధువు ఒకరిపై బలమైన ఆరోపణలు వస్తున్నాయి. సదరు బంధువుకు ఈ కేసుతో ఉన్న లింకులు, మృతదేహం మాయం చేయడంలో అతని ప్రమేయంపై సిట్ ప్రస్తుతం లోతుగా వివరాలు సేకరిస్తోంది. సీఐ కస్టడీ లభిస్తే ఈ కేసులోని మిస్టరీ పూర్తిగా వీడిపోయే అవకాశం ఉంది.
