విశాఖపట్నం, అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరినగర్ ప్రాంతంలోని చెక్కుడు రాయి భవనం వద్ద గురువారం నాడు మృతి చెందిన దివ్య(22)అనే యువతిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువతి మృతిని ముందు అనుమానాస్పద కేసుగా నమోదు చేసినప్పటికీ ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో.. హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు జాగిలాలు దివ్యకు ఆశ్రయం కల్పించిన గూటాల వసంత, ఆమె సోదరి చుట్టూ తిరగడం, వారు ఉంటున్నఇంట్లో పరిస్ధితిని పరిశీలించిన పోలీసులకు అనుమానం రావటంతో కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
తనకంటే అందంగా ఉందనే అసూయతో దివ్యకు గుండు గీయించి, కనుబొమ్మలు గీకేసి చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో వసంత, ఆమె సోదరి మంజు, ఆమెకు సన్నిహితుడైన మరో వ్యక్తి, మరికొందరు కలిసి హత్యచేసినట్లు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్య తల్లిత్రండులు లేకపోవటంతో పిన్నివాళ్లింట్లో పెరిగింది. ఎనిమిది నెలల క్రితం విశాఖపట్నంలోని వసంత ఇంటికి వచ్చిన దివ్యతో ఆమె చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించినట్లు తెలిసింది. వసంత భర్త దుబాయ్ లో ఉంటున్నాడు.
దివ్యను అడ్డం పెట్టుకుని వసంత బాగా డబ్బుసంపాదించింది. పంపకాల విషయంలో ఇద్దరికీ తేడాలొచ్చాయి. తనకు తగినంత డబ్బులివ్వటంలేదని దివ్య వసంతను ప్రశ్నించింది. అది భరించలేని వసంత, దివ్య తన ఇంటినుంచి వెళ్లిపోతుందని భయపడింది. దివ్య ప్రశ్నించటాన్ని తట్టుకోలేని వసంత, ఆమె వెళ్లిపోతే తన ఆదాయానికి గండి పడుతుందని భావించింది.
దీంతో తన సోదరి మరికొందరితో కలిసి దివ్యను హత్య చేయటావికి ప్లాన్ వేసింది. వారంతా దివ్యను ఒక గదిలో బంధించి ఆమెకు గుండు గీయించి, కనుబొమ్మలు కత్తిరించి అందవికారంగా చేశారు. ఐదు రోజులపాటు ఆమెకు అన్నపానీయాలు ఇవ్వకుండా వాతలు పెడుతూ హింసించారు. దీంతో దివ్య శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ఈ హింసను తాళలేక దివ్య బుధవారం రాత్రి కన్నుమూసింది.
గురువారం తెల్లవారేసరికి దివ్య ఫిట్స్తో మరణించిదంటూ వసంత తన బంధువులకు సమాచారం ఇచ్చింది. వారంతా వచ్చి ఇంటిముందు టెంట్ వేసి, దివ్య మృతదేహాన్ని పూలతో కప్పేశారు. స్థానికులకు కూడా అదే విషయం చెప్పింది. అంత్యక్రియల కోసం జ్ఞానాపురంలోని శ్మశానవాటిక కాటికాపరికి సమాచారం అందించారు. మృతురాలి వివరాలన్నీ తీసుకున్న కాటికాపరి 22 ఏళ్ల యువతి ఫిట్స్ తో మృతిచెందటం ఏంటని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించటంతో ఫోర్త్ టౌన్ ఎస్ ఐ పి.సూర్యనారాయణ తన సిబ్బందితో చెక్కుడు రాయి భవనం వద్దకు చేరుకున్నాడు.
మృతి చెందిన యువతి ముఖం, వీపు ఇతర భాగాలపై సిగరెట్ తో కాల్చిన వాతలు పెట్టిన ఆనవాళ్లు ఉండటంతో పాటు మృతురాలి జుట్టు కత్తిరించి ఉంది. దీంతో ఎస్ఐ క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అనుమానితులైన వసంత, మంజులతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు వారినుంచి నిజం రాబట్టారు. ఈకేసులో వీరికి సహకరిచిన మిగిలిన నిందితుల కోసం కోసం గాలిస్తున్నారు.
Read: గంటల వ్యవధిలోనే లంగర్ హౌస్ డబుల్ మర్డర్ కేసుని చేధించిన పోలీసులు