ఏపీకి మహిళా సీఎం అంటూ పీవీపీ పోస్ట్‌! డిలీట్ వెనుక ఏం జరిగింది?

  • Publish Date - February 21, 2020 / 08:36 PM IST

సెన్సార్‌ ఉంటుందని తెలిసి అలాంటి సన్నివేశాలు తీయడం ఎందుకు? సెన్సార్‌కు వెళ్లకుండానే తనే కట్‌ చేసేయడం ఎందుకు? ఎందుకంటే.. ఆ సీన్‌ వల్ల అధిష్టాన వర్గాల్లో మామూలు కాక పుట్టలేదు. అందుకే ముందు జాగ్రత్తగా కట్‌ చేసేశారట. ఆ సీన్‌ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను మార్పులు చేసుకోబోతున్నాయనే చర్చ మొదలైంది. ఒక్క కూత దీనంతటికీ కారణమైంది. కూత అంటే ఏదో అనుకుంటున్నారేమో.. ట్వీట్‌. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, వైసీపీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్‌ అలియాస్ పీవీపీ ట్విటర్‌లో చేసిన ఓ ట్వీట్‌పై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ఆయన ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్‌ చేశారో గానీ.. జనాలు మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు దానిపైన అభిప్రాయాలు వ్యక్తం చేసేస్తున్నారు. రాజకీయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం పీవీపీకి అలవాటే. తాజా పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. 

ఆ ట్వీట్.. వైసీపీలో ప్రకంపనలు :
విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయన.. రాజకీయాల్లో మాత్రం ఉత్సాహంగా పని చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, కార్యక్రమాలను వివరిస్తూ టీడీపీ నాయకుల తీరును సోషల్ మీడియాలో ఎండగడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపుతోంది. చర్చనీయాంశం అయ్యింది. సమకాలీన రాజకీయాలపై చేసిన వ్యాఖ్య త్వరలో ఏపీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఆయన ట్వీట్ వైసీపీలో ప్రకంపనలు రేపడంతో దానిని డిలీట్‌ చేసేశారట. డిలీట్‌ చేసే లోపే చాలా మంది చూసి స్క్రీన్ షాట్ సేవ్ చేసుకోవడంతో ఇప్పుడు వైరల్‌ అయ్యిందంటున్నారు. ఆయన ట్వీట్‌ ప్రధాన సారాంశం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిని చూడాలని అభిలషించారు.

పీవీపీ ట్వీట్ వెనుక అంతరార్థం ఏంటో? :
బూజు పట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ మగ ఆఫీసర్స్.. ఆడవారి ఆర్డర్లను తీసుకోరన్న ప్రభుత్వం వాదనను పక్కనపెట్టి కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్ట్. ఆనాడు అన్న ఎన్టీఆర్‌.. ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం.. ఆస్తిలో సగం.. ప్రజా ప్రతినిధుల్లో సగం.. ప్రభుత్వంలో సగం.. అని పీవీపీ ట్వీటారు. అసలు ఇంత నిగూఢంగా ఎందుకు ఇప్పుడు ఈ ట్వీట్‌ చేశారన్నదే చర్చనీయాంశం అయ్యింది. 

ఎందుకంటే పీవీపీ కోరినట్టుగానే రాష్ట్రంలో జరుగుతాయేమోనని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం జగన్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుతుంటే, తప్పనిసరిగా రావాల్సిందే అని న్యాయస్థానం స్పష్టంచేస్తోంది. ఈ కేసులో ఏ క్షణమైనా విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుండటం, జగన్ అరెస్ట్ కావడం ఖాయమంటూ ప్రచారం జోరందుకుంది. టీడీపీ నేతలు పదే పదే ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ జైలుకెళితే ముఖ్యమంత్రిగా ఆయన భార్య భారతిరెడ్డి లేదా సోదరి షర్మిల పదవీ బాధ్యతలు చేపడతారని చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో పీవీపీ అలాంటి ట్వీట్ చేయడంతో వాటికి బలం చేకూరుతోందని చెబుతున్నారు. 

టీడీపీకి అస్త్రంగా మారిన ట్వీట్ :
మహిళా సీఎంను చూడాలని ఉందంటూ అకస్మాత్తుగా పీవీపీ ట్వీట్ చేయడం వెనక ఏవో కారణాలున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. విచారణలో భాగంగా జగన్ జైలుకెళ్లడం ఖాయమనే వార్తలు ఆయనకు తెలియడంతో ఈ ట్వీట్ చేశారని భావిస్తున్నారు. అయితే, పార్టీ అధిష్టానం పెద్దలు ఒత్తిడి తీసుకు రావడంతో వెంటనే దానిని అకౌంట్‌ నుంచి డిలీట్‌ చేసేశారని అంటున్నారు. అయితే, పీవీపీ ఆ ట్వీట్‌ను రాష్ట్రంలో జరగబోయే పరిణామాలను ఊహించి చేశారని ఆయన సన్నిహితుల్లో వినిపిస్తోన్న మాట. అరెస్టయ్యే సూచనలు ఉండడంతోనే జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేసుల నుంచి తప్పించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి విన్నవించినట్లు టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే పీవీపీ ట్వీట్ అని పేర్కొంటున్నారు. మరి పీవీపీ చేసిన ఈ ట్వీట్ అధికార పార్టీకి తలనొప్పిగా మారనుండగా.. తెలుగుదేశం పార్టీకి ఒక అస్త్రం కానుంది.