Sajjala Ramakrishna Reddy : టీడీపీ, జనసేన పొత్తులో బలం కంటే బలహీనత కనిపిస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ దయనీయంగా మారారని అన్నారు. చంద్రబాబు ఏది పడేస్తే దానికి పవన్ తృప్తి పడడం అలవాటు అయిందంటూ ఎద్దేవా చేశారు. గతంలో రెండుచోట్ల పవన్ ఓడిపోయారని అన్నారు. వైసీపీని ఎందుకు గద్దె దించాలో కారణం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పలేక పోతున్నారని సజ్జల అన్నారు. తాజాగా టీడీపీ – జనసేన సీట్ల పంపకంచూస్తే పవన్ కల్యాణ్ కు బలం లేదని ఒప్పుకుంటున్నారని తేలిందన్నారు.
చంద్రబాబు జనసేన పార్టీని మింగాలని అనుకుంటున్నాడని, జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ విభాగంగా మారిందిన సజ్జల ఎద్దేవా చేశారు. కుప్పంలో కూడా వైసీపీ విజయం వైపు అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తన స్థాయిని దిగజార్చుకొని అభిమానులను, సొంత సామాజిక వర్గం వారిని మోసం చేస్తున్నారని, జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారని సజ్జల వ్యాఖ్యానించారు.
Also Read : టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన
బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని, టీడీపీకి పవన్ కల్యాణ్ ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుందని సజ్జల ఎద్దేవా చేశారు. ఎవరి మీద యుద్ధం చేస్తారు పవన్ కల్యాణ్? మేము మాత్రం ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం. ముందు 24 సీట్లకు పవన్ కల్యాణ్ ను అభ్యర్థులను ప్రకటించమనండి.. పవన్ కల్యాణ్ చిలక పలుకులు పలికితే సరిపోదు అంటూ సజ్జల అన్నారు. పవన్ కల్యాణ్ గాలితో యుద్ధం చేయాల్సి ఉంటుందంటూ ఎద్దేవా చేశారు.