YS Jagan : రెండేళ్లలో మళ్లీ సీఎం అవుతా.. మీ కష్టాలన్నీ తీరుస్తా..
YS Jagan : రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఆక్వా రైతుల సమస్యలపై ఉద్యమ బాటపడతామని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
- Harish Thanniru
- Published on- July 15, 2026 / 01:39 PM IST
YS Jagan
YS Jagan : కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖీ కార్యక్రమం సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు.
Also Read : India – UK FTA : భారత్ – యూకే డీల్ అమల్లోకి వచ్చేసింది.. భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరలు..
రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఆక్వా రైతుల సమస్యలపై ఉద్యమ బాటపడతామని జగన్ అన్నారు. మరో రెండేళ్లలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉండే ప్రభుత్వం వస్తుందని చెప్పారు. “మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను. చూస్తూచూస్తూ రెండేళ్లు గడిచిపోయాయి. మరో రెండేళ్లలో రైతులకు మేలుచేసే ప్రభుత్వం వస్తుంది. మీ జగన్ మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటాడు. రైతులను ఇబ్బంది పెడుతున్న సిండికేట్ను కూకటివేళ్ల వరకు కదిలిస్తాను” అని జగన్ అన్నారు.
ఆక్వా రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఫీడ్ ధరలు, సీడ్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. కానీ, రైతులు పండించిన ఉత్పత్తులకు మాత్రం సరియైన ధర ఇవ్వండం లేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు చర్మం మందంగా ఉంది. దున్నపోతు మీద వర్షం పడినట్టుగా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు సానుభూతిపరుల చేతుల్లోనే ఆక్వా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫీడ్, సీడ్ ధరలను పెంచేసి, పంట ఉత్పత్తులకు ధరలను మాత్రం తగ్గిస్తున్నారు. సిండికేట్ చేతుల్లో ఆక్వా రైతులు నలిగిపోతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే సిండికేట్కు పండగ.. రైతులకు కన్నీళ్లు అని జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో ఏ రైతూ సంతోషంగా లేడు. రైతాంగం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. రైతులకు మద్దతుగా ఉద్యమ బాట పడతాను. ప్రతి రైతుకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ చెప్పారు.
