Amanchi Krishna Mohan – Snake Bite : వైసీపీ నేత పాముకాటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని రొయ్యల చెరువుల వద్ద చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసీపీ ఇంఛార్జి ఆమంచి కృష్ణమోహన్ ను పాము కరిచింది. రొయ్యల చెరువుల వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పాము కాటేసింది. వెంటనే సిబ్బంది ఆయనను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమంచి కృష్ణమోహన్ ను విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. పందిళ్లపల్లి ఆక్వా నర్సరీ వద్ద ఈవినింగ్ వాకింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమంచిని కరిచిన పాముని కట్లపాముగా గుర్తించారు. ఆమంచి కృష్ణమోహన్ పాము కాటుకు గురయ్యారని తెలిసి కుటుంబసభ్యులు, అనుచరులు కంగారుపడ్డారు. వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని వర్రీ అవుతున్నారు.
Also Read..New Ration Cards : ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా 1.67 లక్షల రేషన్ కార్డులు
కాగా, డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆమంచిని మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ నుండి దిగి నడుచుకుంటూ ఆసుపత్రి లోపలికి వెళ్లారు ఆమంచి కృష్ణమోహన్. ప్రస్తుతం ఆమంచికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఆమంచి ఔటాఫ్ డేంజర్ అని చెప్పుకోవచ్చు. అంబులెన్స్ లో ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. పాము కరిచిన వెంటనే సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించడంతో ఆమంచికి ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. విషయం తెలిసి పలువురు పార్టీ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆమంచి హెల్త్ కండీషన్ గురించి ఆరా తీశారు.