Jogi Ramesh Representative Image (Image Credit To Original Source)
Jogi Ramesh: బీసీ నేతని అణగదొక్కాలని టీడీపీ నేతలు చూస్తున్నారని వైసీపీ నేత జోగి రమేశ్ అన్నారు. టీడీపీ వాళ్లు తనను మట్టుబెట్టాలని చూశారని ఆరోపించారు. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ టీడీపీ గూండాలు వచ్చారని జోగి రమేశ్ అన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ తో ఈ బడుగు బలహీన వర్గాల నేతను ఏం చేయాలని చూస్తున్నారని జోగి రమేశ్ ప్రశ్నించారు. నన్ను దొంగ కేసులో ఇరికించి అన్ని జైళ్లు తిప్పినా మీకు కక్ష తీరలేదా? అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల కాలం నుంచే నా మీద, నా కుటుంబం మీద కేసులు పెడుతూనే ఉన్నారని ఆగ్రహించారు.
చిప్ పోయింది అని అనడం తప్పా?
చంద్రబాబుని కానీ లోకేష్ ను కానీ నేను అనకూడని మాటలు ఏమన్నాను, ఇంత దౌర్జన్యం చేస్తారా అంటూ నిలదీశారు. చిప్ పోయింది అని అనకూడదా? అది పెద్ద తప్పా? మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి మొత్తం కేశినేని చిన్ని ఆధ్వర్యంలో బ్లేడ్ బ్యాచ్ తో పక్కా ప్రణాళికతో జరిగింది. దాడి చేసింది నాపైన. నేను ఏదో అన్నానని తిరిగి నా మీదే కేసులు పెట్టారు.
ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు..
తిరుపతిలో, ఇబ్రహీంపట్నంలో కేసులు పెట్టారు. కేసులు పెడితే భయపడను. నా మీద ఎటువంటి దాడి జరిగినా, నాకు ఏం జరిగినా లోకేశ్ అనే వ్యక్తి కారణం. రెడ్ బుక్ రాజ్యాంగంతో మట్టుబెట్టాలని చూస్తే ప్రజలు తిరగబడతారు. నేను ఏం మాట్లాడానని నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అందరినీ గుర్తిస్తాం, ఎవరినీ వదలం” అని జోగి రమేశ్ హెచ్చరించారు.
Also Read: టీడీపీ దాడులపై వైసీపీ కౌంటర్.. ఏం చేయబోతున్నారో చెప్పిన బొత్స