వారిపై త్వరలో పరువు నష్టం దావా వేస్తాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తనకు కోర్టు నుంచి ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదని, అందితే కచ్చితంగా..
- T Venkateshwarlu
- Published On : August 15, 2024 / 11:20 AM IST
peddireddy ramachandra reddy slams chandrababu over handri neeva
తమపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అటువంటి వారిపై చర్యలకు పూనుకున్నామని, ఇప్పటికే నోటీసులు పంపామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఆయన జెండా ఎగురవేసి మాట్లాడుతూ.. తమపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై త్వరలో కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు.
తనకు కోర్టు నుంచి ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదని, అందితే కచ్చితంగా న్యాయపరంగా సమాధానం అందిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసని తెలిపారు. రెండు నెలల్లో ఆరోగ్య శ్రీ పథకానికి రూ.2,500 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని చెప్పారు.
త్వరలో ఆరోగ్య శ్రీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారని తెలిపారు. రానున్న రోజుల్లో పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఫీజు చెల్లించి వైద్యం పొందే పరిస్థితి వస్తుందేమోనని అన్నారు.
Also Read: విచారణ జరిపిస్తాం.. అక్రమార్కులను శిక్షించి తీరతాం: చంద్రబాబు ప్రసంగం
