గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ.. కూటమిలో ఎగ్జిట్ పోల్ టెన్షన్

ఎన్నికల అనంతరం విశ్రాంతి తీసుకున్న పలువురు నేతలు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు.

Exit Polls Tension in TDP : విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్లనున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పనితీరుపై టీడీపీ బాస్ చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ పార్టీ నేతల్లో ధీమా పెరిగింది. ఇప్పటికే తమ అంతర్గత సర్వేలో వార్ వన్ సైడే అని టీడీపీ చెబుతున్నప్పటికీ.. కూటమిలో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ మొదలైంది.

ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయోనని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కు అనుకూలంగా ఉంటే దాదాపుగా అవే ఫలితాలు వస్తాయని పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల అనంతరం విశ్రాంతి తీసుకున్న పలువురు నేతలు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు.

ఇక తాము పోటీ చేసిన స్థానాల్లో గెలుపుపై ధీమాగా ఉంది జనసేన. ఎల్లుండి అమరావతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. త్వరలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలపై ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. చంద్రబాబును బీజేపీ నేతలు కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తోంది. దీంతో గెలిచేది ఎవరు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.

ఎల్లుండి సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎగ్జిట్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎల్లుండి సాయంత్రం దాదాపుగా 6 గంటల తర్వాత వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ ఫలితాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎదురుచూస్తున్నారు. కూటమి నేతలంతా ఎన్నికల్లో హోరాహోరీగా పోరాటం చేశారు. అనేక సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ పాల్గొని ప్రచారం నిర్వహించారు. వీరంతా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కూటమి ముందంజలో ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో సింహభాగం గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో ఒక్క స్థానమే సాధించిన జనసేన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గౌరవప్రదమైన స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. పోలింగ్ జరిగిన సరళిని ఎవరికి వారు సమీక్షించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాతీయ సంస్థలు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే మెయిన్ ఫలితాలకు దగ్గరగా ఉంటాయని పార్టీలు భావిస్తున్నాయి. గెలుపు ధీమా ఉన్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ పై కూటమిలో ఆందోళన ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి? మనం అనుకున్న విధంగా వస్తాయా? రావా? అనే టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొని ఉంది.

Also Read : ఆరు నూరైనా ఫలితమిదే..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..