×
Ad

Janasena : జనసేనకు షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కీలక నేతలు

జనసేనలో టికెట్ల లొల్లి పీక్స్ కు చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు పక్క చూపులు చూస్తున్నారు.

  • Published On : March 30, 2024 / 04:46 PM IST

Janasena : ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపు పార్టీల్లో చిచ్చు రాజేస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు భగ్గుమంటున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పేస్తున్నారు. అప్పటివరకు విమర్శలు చేసిన పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా జనసేనలో టికెట్ల లొల్లి పీక్స్ కు చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు పక్క చూపులు చూస్తున్నారు. కండువా మార్చేస్తున్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేనకు షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా అధికార పార్టీ వైసీపీలోకి చేరికలు నమోదయ్యాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో తుగ్గలి వద్ద.. సీఎం జగన్ సమక్షంలో ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ వైసీపీలో చేరారు. పితానితో పాటు డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్‌ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు.

పితాని బాలకృష్ణ ముమ్మిడివరం జనసేన టికెట్ ఆశించారు. అయితే, పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి వెళ్లింది. దీంతో ఆయన రామచంద్రపురం సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఆ టికెట్ కూడా దక్కకపోవడంతో పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. శెట్టిబలిజలకు ఒకరికి కూడా సీటు ఇవ్వలేదని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు బాలకృష్ణ. పవన్ కల్యాణ్ కనీసం కలిసేందుకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో జనసేనకు రాజీనామా చేసిన పితాని బాలక్రిష్ణ ఫ్యాన్ గూటికి చేరారు.

Also Read : బొత్స ఝాన్సీ వర్సెస్ భరత్.. విశాఖ లోక్‌సభ సీటులో ఈసారి గెలిచేది ఎవరు?