Nagarjuna Kimidi
Nagarjuna Kimidi : విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలో అసమ్మతి సెగలు చల్లారటం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ కిమిడి నాగార్జున కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ నాగార్జున తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చీపురుపల్లి టికెట్ కళా వెంకటరావుకు ఇవ్వటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కిమిడి నాగార్జున.
చీపురుపల్లి టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కిమిడి నాగార్జున. అయితే చీపురుపల్లి టికెట్ ను సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావుకి కేటాయించారు చంద్రబాబు. దీంతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిన్నటి నుంచి కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతున్నారు. టికెట్ దక్కకపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి నుంచి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ వారితో కిమిడి నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జిగా నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కష్టపడ్డానని కిమిడి నాగార్జున తెలిపారు. అలాంటి తనకు కాకుండా తన పెద్దనాన్న కళా వెంకటరావుకి టికెట్ ఇవ్వడం పట్ల కిమిడి నాగార్జున ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ కార్యకర్తల సమావేశంలో నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక సమయంలో కంటతడి కూడా పెట్టారు. తనకు టికెట్ రాకపోవడం చాలా బాధగా ఉందన్నారు. అధిష్టానం ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. కేవలం కళా వెంకటరావు వల్లే తనకు టికెట్ దక్కకుండా పోయిందని పరోక్షంగా విమర్శలు చేశారు నాగార్జున. నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేసిన తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నాగార్జున తప్పు పట్టారు. రానున్న రెండు రోజుల్లో తాను ఒక నిర్ణయం తీసుకుంటానని, తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : టీడీపీలో అసమ్మతి సెగలు.. కిమిడి నాగార్జున రాజీనామా, నూకసాని సంచలన వ్యాఖ్యలు