Hospital
CGHS: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది సర్కారు. ఇటీవల డీఏ పెంపు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్)లో కీలక సంస్కరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలు చేసే ఆరోగ్య భద్రతా పథకమే సీజీహెచ్ఎస్.
సుమారు 2,000 వైద్య విధానాల (మెడికల్ ప్రొసీజర్స్) రివైజ్డ్ ప్యాకేజ్ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇవి అక్టోబర్ 13 నుంచే అమల్లోకి వస్తాయి. గత 15 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో రివైజ్డ్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఉన్న పాత రేట్లు ఉద్యోగులు మాత్రమే కాక ఆసుపత్రులకు కూడా ఇబ్బందులు సృష్టించాయి. (CGHS)
ఈ మార్పులు ఎందుకు చేశారు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సీజీహెచ్ఎస్ కార్డుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్లెస్ చికిత్స పొందవచ్చు. సీజీహెచ్ఎస్ కింద చికిత్స అందించే జాబితాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు సాధారణంగా క్యాష్లెస్ చికిత్స అందించడంలో పలు సమస్యలు ఎదుర్కొనేవి. చాలా మంది రోగులు చికిత్స కోసం పెద్ద మొత్తంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ముందే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. రీయింబర్స్మెంట్ కోసం కొన్ని నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొనేవారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ రేట్లు పాతవని, అవి తక్కువగా ఉన్నాయని ఆసుపత్రులు వాదించాయి. అలాగే, క్యాష్లెస్ చికిత్స అందించాక ప్రభుత్వం నుంచి సమయానికి చెల్లింపులు రావడం లేదని చెప్పేవి. దీంతో, చాలా ఆసుపత్రులు లబ్ధిదారులకు క్యాష్లెస్ సేవలను నిలిపివేసిన ఘటనలు ఉన్నాయి.
2025 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ ఫెడరేషన్ (GENC) ఈ సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లింది. ఆసుపత్రుల్లో క్యాష్లెస్ సేవలు సరిగ్గా అందకపోతుండడంతో ఉద్యోగులు, పెన్షనర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో కూడా చికిత్స అందడం లేదని తెలిపింది.
Also Read: మంచి స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? Vivo V50e 5Gపై అద్భుతమైన ఆఫర్.. కొంతకాలం మాత్రమే..
కొత్త సంస్కరణలో ఏముంది?
ప్రభుత్వం సుమారు 2,000 వైద్య విధానాలకు కొత్త రేట్లు నిర్ణయించింది. ఇవి పట్టణ వర్గం (టైర్-I, టైర్-II, టైర్-III), ఆసుపత్రి క్వాలిటీ (NABH ఆమోదం వంటి) ఆధారంగా ఉంటాయి. NABH అంటే ఆసుపత్రుల నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలకు గుర్తింపు ఇచ్చే సంస్థ