Robotaxi and Robovan
Elon Musk: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్, రోబో ట్యాక్సీ మోడల్స్ ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ‘వీరోబో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మస్క్ పాల్గొని రాబో వ్యాన్, రోబో ట్యాక్సీ మోడల్స్ ను ఆవిష్కరించారు. రోబో వ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది రైలు ఇంజిన్ వంటి డిజైన్లతో తయారు చేయబడింది. ఈ వ్యాను మైలు దూరం ప్రయాణించడానికి 5 నుంచి 10 సెంట్ల వరకు ఖర్చు అవుతుందని, దీనిలో 20 మంది ప్రయాణికులను, సరుకులను తరలించేందుకు వాడుకోవచ్చని టెస్లా బృందం తెలిపింది. రోబో వ్యాన్ చక్రాలు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు. వాహనం అడుగు భాగం భూమికి తక్కువ ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. సైబర్ క్యాబ్ మాదిరిగానే రోబో వ్యాన్ లో కూడా స్టీరింగ్ వీల్ లేదు.
Also Read : Samsung Company: తమిళనాడులో శాంసంగ్ కంపెనీని ఏపీకి తరలిస్తున్నారా? ఇందులో నిజమెంత..
రెండు డోర్లతో ఉన్న స్టిరింగ్ వీల్, పెడల్స్ లేని రోబో ట్యాక్సీని కూడా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. దానిని సైబర్ క్యాబ్ అని పరిచయం చేశారు. రోబో టాక్సీలో ఒకదానిలో స్టేజ్ పైకి వచ్చిన మస్క్ 2026 నుంచి ఈ మోడళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని, దీని ధర రూ.25లక్షలలోపే ఉంటుందని ప్రకటించారు. ప్రతీ మైలు ప్రయాణానికి 20 సెంట్లు ఖర్చు అవుతుందని, కార్లకు స్వీయ నియంత్రణ సామర్థ్యం కల్పిస్తే వాటి వినియోగం ఐదు నుంచి పది రెట్లు పెరుగుతుందని మస్క్ వ్యాఖ్యానించారు.
2019 ఏప్రిల్ లో మస్క్ మాట్లాడుతూ.. 2020 నాటికి టెస్లా కంపెనీ నుంచి రోబో టాక్సీ ఉత్పత్తి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే, అది సాధ్యం కాలేదు. ఆ తరువాత మస్క్ మాట్లాడుతూ.. కంపెనీ మరింత నాణ్యమైన, సరసమైన రోబో టాక్సీని తయారు చేయడంపై దృష్టిసారించాలనే ఉద్దేశంతో ఆలస్యమైందని చెప్పారు. పలు దఫాలుగా వాయిదాల తరువాత తాజాగా మస్క్ రోబో టాక్సీ మోడల్ ను ఆవిష్కరించారు.
Robotaxi & Robovan pic.twitter.com/pI2neyJBSL
— Tesla (@Tesla) October 11, 2024