కొంత మంది వ్యక్తులు జీవిత భీమా పాలసీ తీసుకున్నా ఏదో ఒక కారణాల వల్ల వాటిని కొనసాగించలేక పోతారు. కొన్నాళ్లకు ఆ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అంతకు ముందు కట్టిన డబ్బులు అన్నీ వదులుకోవాల్సిందే. ఒక వేళ తర్వాత ఎప్పుడైనా భీమా చేయాలనిపించినా అప్పటి రూల్స్ ప్రకారం మళ్ళీ కొత్త భీమా పాలసీ తీసుకోవాలి. చెల్లించని తొలి ప్రీమియం గడువు నుంచి రెండేళ్ళ వరకు మాత్రమే ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్దరించుకునే వీలు గతంలో ఉండేది.ఇప్పుడు రెండేళ్ళు దాటినా లాప్స్ అయిన పాలసీలను మళ్లీ పునరుద్దరించుకునే అవకాశాన్ని ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్ధ ఎల్ఐసీ కల్పిస్తోంది.
2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన నాటి నుంచి రెండేళ్ల లోపు మాత్రమే రివైవల్కి అవకాశం ఉంది. 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్ అయి రెండేళ్లు దాటిపోతే.. పునరుద్ధరణకు వెసులుబాటు లేదు. అయితే, పాలసీదారులకు జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు లభించేలా వీటిని కూడా రివైవ్ చేసే అవకాశం కల్పించాలంటూ ఐఆర్డీఏఐని ఎల్ఐసీ కోరింది.
దానికి అనుగుణంగానే తాజా మార్పులు చేసింది. వీటి ప్రకారం.. 2014 జనవరి 1 తర్వాత పాలసీలు తీసుకున్న వారు నాన్–లింక్డ్ పాలసీలను అయిదేళ్ల లోపు, యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్ల లోపు పునరుద్ధరించుకోవచ్చు. తన పాలసీ దారులు జీవిత బీమా కొనసాగిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విపిన్ ఆనంద్ తెలిపారు. ఈ పునరుధ్దరణ సదుపాయం పాలసీదారులకు అద్భుత అవకాశం అన్నారు.