ATM
ATM Transaction Rules: ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా చేసుకునే సమయంలో మోసాలను అరికట్టేందుకు, ముఖ్యంగా కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని మార్పులు చేసింది. ఏటీఎంలో నగదు విత్ డ్రాకు సంబంధించి 2018లో మార్పులు చేయగా.. తాజాగా ఈ నెలలో మరోసారి ఆర్బీఐ స్వల్ప మార్పులు చేసింది. ఖాతాదారుడు ఏటీఎంలోకి వెళ్లి తనకు కావాల్సిన నగదును విత్ డ్రా చేసుకున్న తరువాత.. ఆ మొత్తం ఏటీఎం మిషన్ నుంచి బయటకు వస్తుంది.. అయితే, ఆ డబ్బును తీసుకునే సమయంలో మార్పులు చేసింది.
తాజాగా ఆర్బీఐ కొత్త నియమాల ప్రకారం.. ఏటీఎం మిషన్ నుంచి బయటకు వచ్చిన నగదును 30 సెకన్లలో తీసుకోకపోతే ఆ డబ్బు తిరిగి వెనక్కు వెళ్లిపోతుంది. ఆ తరువాత తిరిగి మీ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. కొన్ని సందర్భాల్లో డబ్బులు డ్రా చేసి తీసుకోకుండా వెళ్లిపోయిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇలాంటి కారణాలతో ఖాతాదారులు డబ్బును పోగొట్టుకోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఈ నిబంధనలు అమలులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త నిబంధన ప్రకారం.. మీరు ఏటీఎం యంత్రం నుంచి బయటకు వచ్చిన డబ్బును సకాలంలో పలు కారణాల వల్ల తీసుకోకపోయినా, ఆ నగదు యంత్రంలోకి తిరిగి వెళ్లిపోయి.. తిరిగి మీ అకౌంట్ లోకి సురక్షితం చేరుతుంది. దీంతో కస్టమర్లకు సురక్షితంగా నగదు ఉపసంహరణ చేసుకోవడం సులభం అవుతుంది.