కేబుల్ టీవీ ప్రేక్షకులు తక్కువ ధరకే ఎక్కువ ఛానళ్లు చూసేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యూటారిఫ్ ఆర్డర్లో సవరణలు చేసింది. ఈ కొత్త సవరణల ప్రకారం కేబుల్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు దాదాపు 200 ఛానళ్లు నెలకు రూ.153కే అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ధర అన్ని పన్నులతో కలిపి ఉంటుందని వెల్లడించింది. దీంతో మరికొన్ని ఛానళ్లు తక్కవ ధరకే చూసే అవకాశం వినియోగ దారులకు కలుగుతుంది. వినియోగ దారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకన్నట్లు ట్రాయ్ తెలిపింది.
ట్రాయ్ విడుదల చేసిన కొత్త టారిఫ్ ప్రకారం.. ఉచిత ఛానళ్లు సంఖ్య పెరగనుండగా, పే ఛానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ ఛానళ్లను కలిపి బ్రాడ్కాస్టింగ్ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్ పరిమితులు విధించింది. బొకే కింద అందించే పే ఛానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి ఛానల్కు బ్రాడ్కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు ఛానల్ను ఇతర ఛానళ్లతో కలిపి అందించేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి మించకూడదు. వీటికి పన్నులు అదనం.
సవరించిన టారిఫ్లను బ్రాడ్కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. 2017లో తీసుకువచ్చిన రూల్స్ సవరిస్తూ తీసుకున్న ఈనిర్ణయం వినియోగదారులకు మార్చి 1 నుంచి అందుబాటులోకి రానుంది. రూ. 130 నెట్వర్క్ కెపాసిటీ ఫీజు తో ప్రస్తుతం ఆపరేటర్ అందించే 100 ఉచిత ఛానళ్ల సంఖ్య…. ట్రాయ్ కొత్త ఆదేశాల ప్రకారం 200కు పెరగనుంది. కేబుల్ టీవీ ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు తమ దగ్గరున్న ఉచిత ఛానళ్లన్నింటినీ అందించేందుకు.. గరిష్టంగా రూ. 160 మించి ఎన్సీఎఫ్ వసూలు చేయరాదు.
ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకారం.. దీర్ఘకాల ప్లాన్లు ఎంచుకునే కస్టమర్లకు ఆపరేటర్లు డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందించాల్సి ఉంటుంది. బ్రాడ్కాస్టింగ్ సంస్థలకు దీటుగా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫాం ఆపరేటర్లు కూడా కొత్త యూజర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ఇవ్వొచ్చు. ఆరు నెలలకు పైగా దీర్ఘకాలిక సబ్స్క్రిప్షన్ తీసుకునేవారికి ఎన్సీఎఫ్పైన, డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరపైన డిస్కౌంట్లు వంటివి ఇవ్వొచ్చు.
అంతేకాక ట్రాయ్ తాజాగా మల్టీ టీవీ కనెక్షన్ రూల్స్ను మార్చింది. ఒకటికి మించి ఎక్కువ టీవీలు ఉన్న ఇళ్లల్లో రెండో టీవీకి వసూలు చేసే ఫీజు.. మొదటి టీవీ సెట్ ఫీజులో 40 శాతాన్ని మించరాదు. ప్రతీ టీవీ కనెక్షన్కు వేర్వేరు ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కొత్తగా తీసుకు వచ్చిన నిబంధనలతో కేబుల్ ఆపరేటర్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
పతనమైన కేబుల్ టీవీ షేర్లు
తక్కువ ధరకే వినియోగదారులు అత్యధిక ఛానళ్లు చూసేలా ట్రాయ్ తీసుకున్న కొత్త నిర్ణయంతో బ్రాడ్కాస్టింగ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల కంపెనీ షేర్లను అతలాకుతలం చేసింది. ఆరంభంలో బాగా పతనమైన ఈ షేర్లు చివరకు మిశ్రమంగా ముగిశాయి. సన్ టీవీ నెట్వర్క్స్, డెన్ నెట్వర్క్స్ షేర్లు 0.1–1.2 శాతం రేంజ్లో నష్టపోయాయి. డిష్ టీవీ ఇండియా 2.2 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి.
Also Read : వీరసావర్కర్ పై వివాదాస్పద పుస్తకం రిలీజ్ చేసిన కాంగ్రెస్