గోల్డ్ రేటు పెరుగుదల వెనుక రీజనేంటి..? సీజన్ లేకున్నా ఎందుకు పరుగులు పెడుతోంది..? కరోనా ఎఫెక్ట్తోనే పసిడి ప్రియమవుతోందా..? నిన్న మొన్నటిదాకా రియల్ రంగంపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు బంగారం కొనుగోళ్లపై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు..? కరోనా వైరస్ కారణంగానే పసిడి పరుగులు పెడుతుందా..? లాక్డౌన్కి ముందు బంగారం ధర 40వేల లోపున్న బంగారం ఉన్నట్టుండి ఎందుకింతగా పెరిగిపోతోంది. బంగారం రేటు తగ్గింపు, పెరుగుదల వెనుక అసలు రీజనేంటి..? గోల్డ్ షాపు గడప తొక్కడం ఇక కలగానే మిగలనుందా? సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షల మారనుందా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
లాక్డౌన్కి ముందు రూ.4వేల లోపే గ్రాము గోల్డ్ ధర :
బంగారం రేటు బంగారమైపోతోంది. రోజురోజుకి పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ కారణంగా చాలా పెళ్లిళ్లు, శుభకార్యాలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంచెం రిలాక్సేషన్ దొరుకుతోంది. దీంతో చాలామంది ఇంట్లో ఫంక్షన్లు చేయాలని భావిస్తున్నారు. దీంతో బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లాక్ డౌన్ కంటే ముందు బంగారం గ్రాము ధర నాలుగు వేల లోపే ఉండేది. కానీ ఇప్పుడు 5వేలకు చేరువైంది. భవిష్యత్తుల్లో ఇది మరింత పెరుగుతుందనే అంచనాలు మరింత కంగారుపెడుతున్నాయి.
10 గ్రాముల బంగారం ధర రూ.80వేలు దాటే ఛాన్స్ :
కోవిడ్ 19 ప్రభావం, లాక్డౌన్, బంగారం ఉత్పత్తి ఆగిపోవడం, క్రుడాయిల్ రేట్లు పడిపోవడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వీటి కారణంగానే బంగారం ధరలను చుక్కల్లోకి తీసుకుపోతున్నాయి. వివాహాది శుభకార్యాలు మొదలుకాకముందే ధరలు ఇలా ఉంటే.. ముందు ముందు ఎలా ఉంటాయోనన్న ఆందోళన మొదలైంది. కరోనా మరింత కంగారెత్తిస్తే 10గ్రాముల బంగారం ధర 80వేలు దాటినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్. ఇదే గనుక జరిగితే సామాన్య జనానికి బంగారం గురించి మాట్లాడుకోవడం బంగారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బంగారాన్ని పెట్టుబడి మార్గంగా చూస్తున్న జనం :
సాధారణంగానే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. 1960లో తులం బంగారం 63.25 రూపాయలు. కానీ ఇప్పుడు 50వేలకు చేరువైంది. సాధారణంగా బంగారాన్ని జ్యువెలరీతో పాటు ఎలక్ట్రానిక్స్, ఇతర ఇండస్ట్రీలలో వినియోగిస్తారు. రేట్లలో అప్పుడప్పుడు ఎక్కువ, తక్కువలు ఉన్నా మొత్తంగా పెరుగుతూనే ఉంటుంది. వినియోగం పెరుగుతుండటమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు వినియోగం బాగా తగ్గినా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కారణం ఇప్పుడు బంగారాన్ని పెట్టుబడిగా చూడడం పెరిగిపోయిందంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్లు. ప్రపంచంలో టాప్ఫైవ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్లలో గోల్డ్ ఒకటని.. జ్యువెలరీ కంటే కాయిన్స్, బిస్కట్స్ రూపంలో బంగారం కొనడం పెరిగిందంటున్నారు. డాలర్తో రూపాయి మారకం రేట్లు పడిపోవడం కూడా మన దేశంలో రేట్లు పెరగడానికి మరో కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం 75 రూపాయలకు అటు ఇటుగా ఉంది. ఇంటర్నేషనల్గా బంగారం రేట్లను డాలర్లలో నిర్ణయిస్తారు. దీంతో డాలర్రేటు పెరిగిన ప్రతిసారి బంగారం ధర పెరుగుతూ ఉంటుంది.
బంగారం కొనుగోళ్లపై పెట్టుబడులు పెరిగే అవకాశం :
రానున్న రోజుల్లో చాలామంది బంగారం కొనుగోళ్లపై పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. 2016లో బంగారంపై ఇన్వెస్ట్మెంట్లు 28 శాతం పెరిగితే.. 2019 నాటికి 33 శాతానికి చేరిందంటున్నాయి. త్వరలోనే 55శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. 21 శాతం జనం బంగారంపై పెట్టుబడులు పెడితే దీర్ఘకాలికంగా లాభాలు ఉంటాయని నమ్ముతున్నారు. 24 శాతం మంది ఎప్పుడైనా అమ్ముకునేందుకు వీలుంటుందని.. మరో 27 శాతం గ్యారంటీ ఇన్కం ఉండే ఇన్వెస్ట్మెంట్అని భావిస్తున్నారని సర్వే నివేదికల సారాంశంగా కనిపిస్తోంది.