New Project (1)
‘గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త’ అంటూ వస్తోన్న వార్త ఫేక్. ఆ మెసేజ్ కు మోసపోయి లింక్ క్లిక్ చేసి లక్షల్లో పోగొట్టుకున్నారు. కొద్ది రోజులగా సోషల్ మీడియాలో ‘గూగుల్ పే వినియోగదారులకు ఇది శుభవార్త. స్క్రాచ్ కార్డును రూ.500 నుంచి రూ.5000 వరకూ గెలుచుకోవచ్చు’ అని గూగుల్ లింక్లు ఫోన్కు మెసేజ్, వాట్సాప్ రూపంలో వస్తున్నాయి.
ఒక్కసారి క్లిక్ చేసి ఎంటర్ అయితే ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది. కార్డును ఓపెన్ చేసిన వారికి నగదు ఉన్నట్లు కనిపించింది. అవి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవ్వాలంటే కేవైసీ వివరాలు అప్లోడ్ చేయండి అని వస్తుంది. డబ్బు మాత్రం ఖాతాలో జమకాదు.
అక్కడితో అయిపోయినట్లే. మన అకౌంట్ హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. ఇలాంటి లింక్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు. సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన మోసపూరితమైన లింక్లని, వాటిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే బ్యాంక్ ఖాతాలోని సొమ్ము కాజేస్తారని పేర్కొన్నారు.
రూ.5.29 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్
సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్కు అక్టోబర్ 21న ఎస్ఎంఎస్ వచ్చింది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం.. వెంటనే మీ కేవైసీ, ఖాతా వివరాలు అప్డేట్ చేయాలి.. లేకపోతే నిలిపివేస్తాం, డెబిట్ కార్డు పనిచేయదు అని దాని సారాంశం. ఆ మెసేజ్తోపాటు గూగుల్ లింక్ పంపారు. డాక్టర్ అనుమానించకుండా గూగుల్ లింక్ ఓపెన్ చేసి వివరాలు నింపారు. అవన్నీ సైబర్ నేరగాళ్లకు చేరాయి. నిమిషాల్లో డాక్టర్ ఖాతాలో ఉన్న రూ. 5.29 లక్షలు కాజేశారు.