Chittoor Robbery Attempt : చిత్తూరులో దొంగల కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్..
ఆ సమయంలో అత్యంత చాక్యచక్యంగా వ్యవహరించిన చంద్రశేఖర్.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
- Naveen
- Updated on- March 12, 2025 / 06:46 PM IST
Chittoor Robbery Attempt : చిత్తూరు కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫర్నీచర్ వ్యాపారి చంద్రశేఖర్ వ్యాపార భాగస్వాములే దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఏడుగురు దొంగల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారైన మరో ఇద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఐదుగురి నుంచి సమాచారం రాబట్టిన పోలీసులు.. మిగతా ఇద్దరి కోసం వెతుకుతున్నారు. చిత్తూరు టౌన్ గాంధీరోడ్ లో ఇవాళ తెల్లవారుజామున దొంగల కాల్పులు కలకలం రేపాయి. అర్థరాత్రి ఏడుగురు దొంగల ముఠా చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్ కి ఓ మినీ వ్యాన్ లో చేరుకుంది. అక్కడ ఫర్నీచర్ వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడిండి.
ఇంటి వెనకవైపు నుంచి ఇంట్లోకి చొరబడ్డారు. దొంగలను చూసి ఇంట్లో ఉన్న చంద్రశేఖర్, అతడి భార్య ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దొంగలు తుపాకులతో చంద్రశేఖర్ ని బెదిరించారు. ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అడ్డుకోబోయిన చంద్రశేఖర్ పై దొంగలు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర్ చేతికి గాయమైంది. చంద్రశేఖర్, దొంగల మధ్య పెనుగులాట జరిగింది. ఆ సమయంలో అత్యంత చాక్యచక్యంగా వ్యవహరించిన చంద్రశేఖర్.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
