కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లల్లో ఉంటే సైబర్ నేరగాళ్లు కోవిడ్ టెస్టుల పేరుతో ప్రజలను దోచేయటం మొదలెట్టారు. మీకు కొవిడ్ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు. పొరపాటున మీకేదైనా అలాంటి ఈ-మెయిల్ వచ్చిందంటే దాన్నితెరవవద్దు అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ncov2019@gov.in పేరుతో వచ్చిన ఈ-మెయిల్ను ఎట్టిపరిస్థితుల్లో తెరవొద్దని హెచ్చరిస్తున్నారు.
అలాంటి మెయిల్స్ను తెరిస్తే మీరు సైబర్ మోసగాళ్ల వలకు చిక్కినట్టేనంటున్నారు. ఇలాంటి హానికరమైన ఈ- మెయిళ్లను తెరిస్తే మిమ్మల్ని మీరు ప్రమాదంలోకి నెట్టుకున్నట్టేనని, మీ వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని హ్యాకర్ల చేతిలో పెట్టినట్టేనంటోంది ద ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (Cert-In). ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కింద సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే ఓ నోడల్ ఏజెన్సీ.
ఇప్పటికే దేశంలో అనేకమంది వ్యాపారులు, వ్యక్తులు సైబర్ నేరగాళ్ల మోసాలకు గురయ్యారని ఒక వేళ అలాంటి ఈ-మెయిల్స్ వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాంటి ఈ-మెయిల్స్ వస్తే మీకు వస్తే వాటిని తక్షణమే డిలీట్ చేయమంటున్నారు సైబర్ నిపుణులు. ప్రపంచమంతా కరోనా భయంలో వణికిపోతుంటే… సైబర్ నేరగాళ్లు మాత్రం ప్రభుత్వ ఏజెన్సీలు, శాఖలు పంపినట్టుగా ఇలాంటి ఫిషింగ్ మెయిల్స్ను పంపించి అమాయకుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
ఇలాంటి నకిలీ ఈ- మెయిల్స్ మిమ్మల్ని నకిలీ వెబ్సైట్ల వైపు తీసుకెళ్తాయని తద్వారా హానికర ఫైల్స్ను డౌన్లోడ్ కావడంతో పాటు వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించి మోసాలకు పాల్పడతాయని హెచ్చరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 20లక్షల ఈ మెయిల్ ఖాతాలకు ఇలాంటి హానికరమైన మెయిల్స్ వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తాం అంటూ ఈ-మెయిల్స్ వస్తున్నాయని ఈ నోడల్ ఏజెన్సీ తెలిపింది.
ఈ నకిలీ ఈ మెయిల్స్ నుంచి మీకు మీరు రక్షించుకోవాలంటే కీలకమైన డాక్యుమెంట్లు/ సమాచారాన్ని అత్యంత సురక్షితంగా ఉంచుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యాంటీ వైరస్ టూల్స్ను ఇన్స్టాల్ చేసుకుంటే ఈ మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. మీకు తెలియని, సంబంధంలేని విషయాలకు సంబంధించిన మెయిల్స్ వస్తే వెంటనే https://www.cert-in.org.in/ సమాచారం పంపాలని సూచిస్తున్నారు.
ఉద్రేకపరిచే మెసేజ్ లు, ఈ మెయిల్స్ను వస్తే వాటిని తెరవొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. మీకు తెలిసిన వారినుంచి ఇలాంటి మెయిల్స్ వస్తే వాటిని తెరవకుండా వారితో మాట్లాడటం మంచిదంటున్నారు. మీకు రివార్డులు, బహుమతులు, వచ్చాయి. అందులో భాగంగా కరోనాకు ఉచితంగా పరీక్షలు చేస్తా అంటూ వచ్చే ఈ మెయిల్స్తో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.