Father Killed Daughter : కేరళలో మహిళల నరబలి ఘటన మరువకముందే గుజరాత్లో మరో నరబలి ఘటన చోటుచేసుకుంది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో 14 ఏళ్ల కూతురిని తండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తోంది. గిర్సోమనాథ్ జిల్లా ధరాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. నవరాత్రి రోజు ఆ కుటుంబం తన కూతురుని బలిచ్చిందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఫోరెన్సిక్ నిపుణులు బృందం సహాయంతో బాలిక చితాభస్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక తండ్రి భవేశ్ అక్బరీని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
కుటుంబ సభ్యుల ప్రవర్తన తేడాగా ఉందని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి భవేశ్ ఇచ్చిన సమాధానాలు గందరగోళంగా ఉండడంతో పోలీసుల అనుమానం బలపడింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు ఎస్పీ మనోహర్సిన్హ్ జడేజా పేర్కొన్నారు.