Husband Killed Wife In Nellore District
Husband Killed wife in Nellore district : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్త భార్యను కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నెల్లూరు జిల్లా గూడురు పట్టణం దిగువ వీరారెడ్డి పల్లికి చెందిన శ్రీహరి వ్యవసాయం చేస్తూ భార్య సుజాత, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు.
ఈమధ్య కాలంలో భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో శ్రీహరి సరిగా ఇంటికి రావట్లేదు. ఇటీవల శ్రీహరి ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బుతో పేకాట ఆడుతూ కాలక్షేపం చేయసాగాడు. ఈ సంగతి తెలిసిన సూజాత భర్తకు ఫోన్ చేసింది.
తోట వద్ద ఉన్నానని, ఇక్కడకు రావాలంటూ భార్యకు చెప్పాడు. భర్త రమ్మనే సరికి నిజమని నమ్మిన సుజాత..తన సోదరులకు ఫోన్ చేసి భర్త రమ్మన్నాడని, తోట వద్దకు వెళుతున్నానని చెప్పింది. ఈక్రమంలో తోటకు వెళ్లిన సుజాత శనివారం కూడా రాకపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు తోట వద్దకు వెళ్లారు.
తోటలో సగం కాలిన సుజాత మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుజాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శ్రీహరి కోసం గాలింపు చేపట్టారు.