Wife Dharna At Husband House
Hyderabad wife protest in front of husband house : పెళ్లైన వారం రోజులకే భార్యను వదిలించుకునేందుకు భర్త వేధించటం మొదలెట్టాడు. భర్త సంసారానికి పనికిరాడని తెలిసి కూడా పెళ్లి చేసారని ఆరోపిస్తూ అత్తింటి ముందు కొత్తకోడలు ధర్నాకు దిగింది.
కరీంనగర్, భగత్ నగర్ కాలనీకి చెందిన గుంజి శ్రీనివాస్ , పద్మలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉంటున్నాడు. జనవరి 8వ తేదీన వారి పెద్ద కుమార్తె తేజస్విని ని..హైదరాబాద్ రాక్ టౌన్ లో నివాసం ఉండే బత్తుల ఏడుకొండలు పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావుకి ఇచ్చి వివాహం జరిపించారు.
వివాహా సమయంలో అల్లుడుకి కానుకలుగా రూ. 20లక్షల వరకు బంగారం, కట్నకానుకలుగా అందచేశారు. ముహూర్తం సమయంలో తన నానమ్మకు ఒంట్లో బాగోలేదని చెప్పి పెళ్లి తంతుని త్వర..త్వరగా ముగించారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు. వెంకటేశ్వరరావు హైదరాబాద్ లోని క్లేవ్ టెక్ సాఫ్ట్ వేర్ సంస్ధలో, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. తేజస్వినీ బీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది.
పెళ్లైన వారం రోజుల నుంచి అత్తింటి వారి వేధింపులు ప్రారంభమయ్యాయని తేజస్వినీ ఆరోపించింది. భర్త, అత్తమామలు ఆడపడుచు కలిసి వేధించేవారని…. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసి కాపురానికి తీసుకు రాకుండా పుట్టింటి వద్దే బాధితురాలిని ఉంచుతున్నారని తెలిపింది.
తన భర్త వెంకటేశ్వరరావు సంసారానికి పనికిరాడనే విషయం కుటుంబ సభ్యులకు తెలిసినా పెళ్లి చేసి కట్నకానుకలు తీసుకున్నారని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పింది.
అత్తింటి వేధింపులపై ఆమె మార్చి 24న ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసును సరూర్ నగర్ మహిళా పోలీసు స్టేషన్ కు ట్రాన్సఫర్ చేశారు. అక్కడ పోలీసులు రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ చేశారు.
పెద్దలసమక్షంలో రెండు రోజుల్లో పరిష్కరిచుకుంటామని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఇప్పటి వరకు వారినుంచి ఎటువంటి స్పందన రాకపోవటంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఉదయం అత్తింటి ఎదుట ధర్నాకు దిగింది.