Baba Siddique : మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై దుండగుల కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి!

Baba Siddique : బాంద్రాలో మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందారు.

Maharashtra Ex Minister Baba Siddique Shot Dead Inside Son's Office In Mumbai

Baba Siddique : మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో సిద్ధిఖీ ఉదరంపై దుండగులు కాల్పులు జరపగా, ఆయన్ను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న బాబా సిద్ధిఖీ మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. మాజీ మంత్రిపై కాల్పులకు పాల్పడిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వారిలో యూపీకి చెందిన ఒకరు, హర్యానాకు చెందిన ఒకరు ఉండగా, మరొకరు పరారీలో ఉన్నారని ముంబై పోలీసులు పేర్కొన్నారు. హత్యకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధిఖీ.. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఫిబ్రవరిలో పార్టీని వీడి అజిత్ పవార్ ఎన్‌సీపీలో చేరారు. జీషన్ బాబా సిద్ధిఖీని ఆగస్టులో కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. మరో నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కాల్పులు ఘటన చోటుచేసుకుంది. సిద్ధిఖీ 1999, 2004, 2009లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2008 మధ్య ఆహార, పౌర సరఫరాలు, కార్మిక, ఎఫ్‌డీఏ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

మాజీ ఎమ్మెల్యే తన రాజకీయ చతురతతోనే కాకుండా పార్టీలను నిర్వహించడంలో కూడా పేరుంది. 2013లో సిద్ధిఖీ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. సల్మాన్ ఖాన్, నటుడు సంజయ్ దత్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. సిద్ధిఖీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ముంబైలో శాంతిభద్రతల గురించి ప్రశ్నలను లేవనెత్తారు, వై-స్థాయి భద్రత ఉన్న రాజకీయవేత్తను బాంద్రా వంటి ఉన్నత ప్రాంతంలో బహిరంగంగా ఎలా చంపగలరని ప్రశ్నించారు.

Read Also : అమాత్య అదృష్టం ఎప్పుడు? దీపావళి తర్వాతైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా..