Love Affair : తల్లి ప్రాణం తీసిన కొడుకు ప్రేమ వ్యవహారం
కొడుకు ప్రేమ ఓ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. ప్రేమ వ్యవహారంలో కొడుక్కి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో తనకు జరిగిన అవమానంతో తల్లి బలవన్మరణానికి పాల్పడింది.
- chvmurthy
- Published On : July 25, 2022 / 09:27 PM IST
Ongole Mother Suicide
Love Affair : కొడుకు ప్రేమ ఓ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. ప్రేమ వ్యవహారంలో కొడుక్కి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో తనకు జరిగిన అవమానంతో తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగాపురం గ్రామానికి చెందిన సత్తనపల్లి సాలమ్మ బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా హోంగార్డుగా పనిచేస్తోంది. సాలమ్మకు ఇద్దరు కుమారులు..పెద్ద కొడుకు వినయ్ కంభం పట్టణానికి చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. మూడు నెలల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. పెద్దలు ఇద్దరిని తీసుకు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత పెద్ద కుమారుడిని హోంగార్డు సాలమ్మ కాకినాడలోని కోచింగ్ సెంటర్లో ఉంచి చదివిస్తోంది.
మూడు నెలల తర్వాత మరోసారి ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో సాలమ్మకు సమస్య మొదటికి వచ్చింది. అమ్మాయి తరపు కుటుంబీకులు సాలమ్మను నిలదీశారు. ఇది అవమానంగా భావించిన సాలమ్మ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మొదట సాలమ్మను వైద్యం కోసం ఒంగోలుకు తరలించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హోంగార్డు సాలమ్మ కన్ను మూసింది. సాలమ్మ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాగా…. సాలమ్మ తన డైరీలో సూసైడ్ నోట్ రాసుకుంది. అవమానంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నా అని ఎస్పీకి విన్నవించుకుంది. తన కుమారుడికి అన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్పానని అయినా కానీ తన మాట వినలేదని పేర్కొంది. అమ్మాయి తరపు వాళ్లు తన ఇంటి వద్దకు వచ్చి కులం పేరుతో దూషించి చెప్పుకోలేని విధంగా తిట్టారని…. తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారని వాపోయింది. తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎస్పీకి మొరపెట్టుకుంది. ప్రేమ మోజులో పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకుకు కనీసం తల్లి మరణ వార్త కూడా తెలిసిందో లేదో అంటూ సాలమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : KCR Delhi Tour : కేసీఆర్ ఢిల్లీ టూర్-రెండు రోజులు హస్తినలోనే..
