హైదరాబాద్ పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో పెళ్లికి కాసేపటి ముందు పెళ్లికొడుకు సందీప్ మృతి చెందిన కేసు కొత్త మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని
హైదరాబాద్ పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో పెళ్లికి కాసేపటి ముందు పెళ్లికొడుకు సందీప్ మృతి చెందిన కేసు కొత్త మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని సందీప్ తండ్రి నక్కెర్తి శ్రీనివాస్చారి చెబుతున్నారు. సందీప్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పెళ్లికి ముందు ఫొటోషూట్కు వెళ్లి ఆత్మహత్య ఎలా చేసుకుంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సందీప్ హత్యకు బాబాయ్, పిన్నమ్మలే కారణం అని ఆయన ఆరోపించారు. తన కొడుక్కి తాత ఆస్తిలో వాటా ఇవ్వాల్సివస్తుందనే హత్య చేశారని శ్రీనివాస్ చారి చెప్పారు.
సందీప్ తల్లి చనిపోయిన నాటి నుంచి అతడిని తనకు దూరంగా ఉంచారని శ్రీనివాస్ తెలిపారు. 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన భార్య మృతిపైనా అనుమానాలు ఉన్నాయన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు సందీప్తో తాను గొడవ పడలేదని స్పష్టం చేశారు. సందీప్ కోరినట్టే పెళ్లి, రిసెప్షన్ చేస్తానని చెప్పినట్టు వెల్లడించారు. పెళ్లికి కొద్ది గంటల ముందు ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం పెళ్లి వేడుక కొంపల్లి టీ-జంక్షన్లోని శ్రీకన్వెన్షన్లో సందీప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో సందీప్ తండ్రి చేసిన ఆరోపణలు కేసుని మరో మలుపు తిప్పాయి. సందీప్ తండ్రి ఆరోపణలతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. సందీప్ ది హత్య? ఆత్మహత్యా? అని తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా.. ఈ ఘటన వధువు కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.