Old Man Suicide : హిందీ భాషా వివాదం నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశంపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మనస్తాపం చెందిన ఓ వృద్ధ రైతు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మెట్టూరు సమీపంలోని తలయూరులో చోటు చేసుకుంది. సేలం జిల్లాలో 85 ఏళ్ల తంగవేల్ అనే వృద్ధ రైతు శనివారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో డీఎంకే కార్యాలయం ముందు ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
‘మోదీ సర్కార్, కేంద్ర సర్కార్.. మాకు హిందీ వద్దు. మా మాతృభాష తమిళం. హిందీ విదూషకుల భాష. హిందీని రుద్దితే మా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి. హిందీ తొలగించాల్సిందే’ అని రాసిన బ్యానర్ ఆయన తనతో తెచ్చాడు. నిప్పంటించుకున్న కొద్దిసేపటికే కాలిన తీవ్ర గాయాలతో వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు డీఎంకే పార్టీ వ్యవసాయ సంఘం మాజీ నాయకుడని, ఇటీవలి కాలం వరకు డీఎంకే క్రియాశీల సభ్యుడని సమాచారం.
Actress Suhasini : హిందీ భాషా వివాదం..సీనియర్ నటి సుహాసిని సంచలన వ్యాఖ్యలు
మరోవైపు డీఎంకే కార్యకర్త అయిన తంగవేల్ ఆత్మహత్యపై తమిళనాడులోని అధికార పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ విద్యా సంస్థల్లో హిందీ బోధనను అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తామని సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన సంఘం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు.