Cyber Slavery (Photo Credit : Google)
Cyber Slavery : సైబర్ స్లేవరీ (సైబర్ బానిసత్వం).. భారతీయులను ఆందోళనకు గురి చేస్తోంది. సుమారు 30వేల మంది ఇండియన్స్ ఆచూకీ తెలియడం లేదు. వారంతా ఏమయ్యారు? ఎక్కడున్నారు? సురక్షితంగా ఉన్నారా? అన్న ప్రశ్నలు టెన్షన్ పెడుతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డేటా ప్రకారం 73వేల 138 మంది భారతీయులు కాంబోడియా, థాయ్ ల్యాండ్, మయన్మార్, వియత్నాం దేశాలకు వెళ్లారు. వీరంతా జనవరి 2022 నుంచి మే 2024 మధ్య వెళ్లారు. విజిటర్ వీసాలపై అక్కడికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
వీరిలో 29వేల 466 మంది ఇంకా తిరిగి రావాల్సి ఉంది. ఈ వ్యక్తులలో సగానికి పైగా అంటే 17వేల 115 మంది.. 20 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. అందులోనూ పురుషులు (21,182) ఎక్కువ మంది ఉన్నారు. అలా వెళ్లిన వారి ఆచూకీ తెలియడం లేదు. దీంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారి క్షేమ సమాచారం తెలియక కంగారు పడుతున్నారు.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సమాచారం ప్రకారం.. అచూకీ లేని భారతీయుల్లో మూడింట ఒక వంతు మంది పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారే. 20,450 మంది వ్యక్తులు తప్పిపోయినట్లు నివేదించబడిన ఈ కేసులలో 69 శాతానికి పైగా థాయ్లాండ్ మాత్రమే కారణమైంది.
అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఇదంతా పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని కొన్ని సంస్థలు ఊరిస్తున్నాయి. ఆ ప్రకటనలు చూసి భారతీయులు ఆగ్నేయ ఆసియా దేశాలకు అట్రాక్ట్ అవుతున్నారు. కట్ చేస్తే అదో ఘరానా మోసం అని తెలుస్తోంది. అదొక ట్రాప్. అలా వెళ్లిన వారిని సైబర్ బానిసలుగా మార్చేస్తారు. బాధితులతో సైబర్ మోసాలు, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయిస్తారు. వాళ్లు చెప్పినట్లు వినకపోతే టార్చర్ పెడతారు. చంపడానికి కూడా వెనకాడరు అని అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాఫ్తు కోసం ఉన్నత స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. మేలో ఏర్పాటైన ఈ ప్యానెల్.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమగ్రమైన గ్రౌండ్-లెవల్ వెరిఫికేషన్ నిర్వహించి తప్పిపోయిన వ్యక్తుల వివరాలను సేకరించాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు.. బాధితులు దేశం విడిచి వెళ్లే ముందు వారిని గుర్తించే యంత్రాంగాన్ని మెరుగుపరచాలని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ని టాస్క్ ఫోర్స్ కోరింది.
రాష్ట్రాల వారీగా ఆచూకీ లేని వ్యక్తుల సంఖ్య..
భారత్ నుంచి సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు వెళ్లి తిరిగిరాని వ్యక్తుల్లో ఎక్కువగా.. పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత..
ఉత్తరప్రదేశ్ (2,946)
కేరళ (2,659)
ఢిల్లీ (2,140)
గుజరాత్ (2,068)
హర్యానా (1,928).
కర్నాటక, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది తిరిగి రావాల్సి ఉంది. వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుండి ఆ సంఖ్య తక్కువగానే ఉంది.
ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిన 12వేల 493 మంది ఆచూకీ తెలియడం లేదు. ఆ తర్వాత ముంబై ఎయిర్ పోర్టు (4,699), కోల్ కతా ఎయిర్ పోర్టు (2,395), కొచ్చి ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిన వారిలో (2,296) తిరిగి రాలేదు.
ఒక్క కాంబోడియా దేశంలోనే 5వేల మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారనే వార్తలు ఆందోళను గురి చేస్తున్నాయి. బాధితులతో బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నట్లు సమాచారం. డేటా ఎంట్రీ జాబ్స్ పేరుతో భారతీయులను విదేశాలకు పంపి.. అక్కడికి వెళ్లాక వారితో సైబర్ మోసాలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయిస్తారని అధికారుల విచారణలో బయటపడింది.
Also Read : ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ.. యువకుడి మృతిపై ఆరోగ్య శాఖ దర్యాప్తు..!