Drugs Case : బంజారా హిల్స్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల నాలుగు రోజుల కస్టడీ ఈరోజు సాయంత్రం ముగిసింది. పబ్ నిర్వాహకుడు అభిషేక్, మేనేజర్ అనిల్ ను నాలుగు రోజుల పాటు విచారించినా వారి నుంచి ఎటువంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టలేకపోయారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా నిందితులు నోరు మెదపలేదు.
అభిషేక్, అనిల్ సిడిఆర్ ఆధారంగా పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా నిందితులు సమాధానం రాబట్టలేకపోయారు. పబ్లో రికవరీ అయిన నాలుగు గ్రాముల కొకైన్ గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితులనుంచి తెలియదు అనే సమాధానమే వచ్చింది. రైడ్ చేస్తున్నారు అన్న సమాచారం తోనే కస్టమర్స్ ఎవరో పడేశారు అని అనిల్,అభిషేక్ బదులివ్వటంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
కేవలం మూడు నెలల నుండే తాము పబ్ను నడుపుతున్నట్లు అభిషేక్ పోలీసులకు చెప్పాడు. అసలు పబ్లో డ్రగ్స్ యాక్టివిటి ఉండదని… పోలీసులకు ఎలా దొరికిందో నాకు తెలియదు అని అభిషేక్ చెప్పాడు. తమకు కస్టమర్స్కు కమ్యుూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకే పామ్ అనే సాఫ్ట్వేర్ వాడినట్టు అభిషేక్ వివరించాడు.
ఈనెల 3న లేట్ నైట్ పార్టీకి ఎక్కువ మంది కస్టమర్స్ రావడం వాస్తవం అని నిందితులు ఒప్పుకున్నారు. ఈనెల 14 నుండి నాలుగు రోజుల పాటు విచారిస్తున్నా నిందితులు సరైన సమాధానాలు చెప్పకపోవటంతో కేసు ఎలా చేధించాలా అని పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు.
Also Read : Bandi Sanjay Kumar : ఆర్డీఎస్ చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం-బండి సంజయ్ హామీ
నిందితులిద్దరినీ రేపు ఉదయం గం.10-30 లకు వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. కాగా…. నాలుగురోజుల బంజారా హిల్స్ పోలీసుల కస్టడీ ముగియటంతో నిందితుల తరుఫు న్యాయవాదులు మళ్లీ బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు…. పోలీసులు కూడా మరోసారి నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది.