Telangana Man : సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడు మృతి.. దారితప్పి, ఆకలితో అలమటించి..!
Telangana Man : కరీంనగర్కు చెందిన 27ఏళ్ల మహ్మద్ షెహజాద్ ఖాన్తో పాటు అతని సూడాన్ సహోద్యోగి సైతం నీరు లేక డీహైడ్రేషన్, అలసటకు గురై మరణించారు.
- Sreehari A
- Published On : August 25, 2024 / 07:29 PM IST
Telangana man, colleague die after losing GPS signal ( Image Source : Google )
Telangana Man : సౌదీ అరేబియాలోని రుబ్ అల్ ఖలీ అనే ఎడారిలో తెలంగాణ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన అతడు తన స్నేహితుడిని కలిసి ఎడారిలో దారితప్పాడు. అదే సమయంలో తన ఫోన్లోని జీపీఎస్ కూడా పనిచేయకపోవడంతో నాలుగు రోజులుగా ఆకలితో అలమటించి చివరికి ప్రాణాలు వదిలాడు.
కరీంనగర్కు చెందిన 27ఏళ్ల మహ్మద్ షెహజాద్ ఖాన్తో పాటు అతని సూడాన్ సహోద్యోగి సైతం నీరు లేక డీహైడ్రేషన్, అలసటకు గురై మరణించారు. మహ్మద్ షెహజాద్ ఖాన్ సౌదీ అరేబియాలో టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు.
షెహజాద్ తన సుడానీస్ సహోద్యోగితో కలిసి ఎడారిలో అతని జీపీఎస్ సిగ్నల్ కోల్పోవడంతో ఈ సంఘటన జరిగింది. షెహజాద్ ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయిందని, ఇద్దరు సాయం కోసం కాల్ చేయలేకపోయారని నివేదిక తెలిపింది. కొద్దిసేపటికే, వారి వాహనంలో ఇంధనం కూడా అయిపోయింది.
ఇద్దరు యువకులు ఎడారిలో వేడి కారణంగా ఆహారం, నీరు దొరక్క అలమటించారు. ‘రబ్ అల్ ఖలీ’ ఎడారి అత్యంత ప్రమాదకరమైనది. ఆ ఎడారిలో చిక్కుకుంటే ప్రాణాలతో బయటపడటం కష్టమే. 650 కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిన రబ్ అల్ ఖలీ ఎడారి సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతాలలో కఠినమైన పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది.
అలాంటి ఎడారిలో చిక్కుకున్న ఇద్దరు యువకులు మనుగడ కోసం పోరాడినప్పటికీ, భారీ ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్కు గురయ్యారు. ఎడారిలోకి వెళ్లిన 4 రోజుల తర్వాత ఇసుక తిన్నెల్లో వారి వాహనం పక్కన పడి ఉన్న వారి మృతదేహాలను గుర్తించారు. వారు వెళ్లే కారు ఇసుక తిన్నెల్లో నిలిచిపోయింది. దారి తెలియక వారిద్దరూ ఎడారి లోపలికి వెళ్లిపోయారు. అంతా ఎడారి ప్రాంతం కావడంతో ఎటు వెళ్లాలో తెలియక నమాజ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు. ఎండ వేడిమి, ఆకలికి తట్టుకోలేక చివరికి ప్రాణాలను విడిచారు.
సూడాన్ జాతీయుడైన షెహజాద్ సహోద్యోగి గురించి సమాచారం తెలియరాలేదు. కంపెనీ సర్వీసు నిమిత్తం బయటకు వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకపోవడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరి కోసం పోలీసులు గాలించగా ఇసుక తిన్నెల్లో విగతజీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
Read Also : కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనపై నిరసనల వేళ.. మోదీ కీలక వ్యాఖ్యలు
