Realtor Murder Case Accused Arrested
Realtor Murder Case : సికింద్రాబాద్ తిరుమలగిరి రియల్టర్ విజయభాస్కర్ రెడ్డిని వారి బంధువు తోట నరేందర్ రెడ్డే హత్య చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. నిందితుడు నరేందర్రెడ్డిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నరేందర్ రెడ్డి నాటు తుపాకీతో విజయభాస్కర్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి వద్దనుంచి రెండు తుపాకులతో పాటు 2 రౌండ్స్ లైవ్ బుల్లెట్స్, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ తిరుమలగిరిలో రియల్టర్ విజయభాస్కర్ రెడ్డి సోమవారం హత్యకు గురయ్యాడు. పెద్ద కబేళాలోని ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో ఓ కారులో చనిపోయి ఉన్నాడు. సోమవారం రాత్రి కారులో మృతదేహం గుర్తించిన స్ధానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. విజయభాస్కర్ది అనుమానాస్పద మృతిగా మొదటగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు కొనసాగించారు. కానీ తలపై బుల్లెట్ గాయం ఉండటం…కుటుంబ సభ్యులు అనుమానాలతో, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
Also Read : Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు
కుటుంబ సభ్యులు ఇచ్చిన అనుమానితులలో మృతుని బంధువు తోట నరేందర్ రెడ్డితో పాటు మరో వ్యక్తి అబ్రహాంపై అనుమానాలు వ్యక్తం అవటంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా ఆర్ధిక లావాదేవీల్లో వచ్చిన తేడాలవల్లే విజయభాస్కర్ రెడ్డిని హత్య చేసినట్లు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు. తనకు ఇవ్వాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయటంతో నరేందర్ ఈహత్యకు పాల్పడినట్లు తెలిసింది.