×
Ad

విషాదం….జ్వరంతో పరీక్ష కెళ్ళాడు, పరీక్ష రాస్తూ మృత్యు ఒడిలోకి జారిన విద్యార్ధి

  • Published On : February 21, 2021 / 10:48 AM IST

Tragedy in Bihar, 10th class student dies in board exam center due to high fever : బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రరి 17 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కాలంలో విద్యార్ధులు అన్ లైన్ లో క్లాసులకు అటెండయ్యారు. పరీక్షలు  సజావుగా జరుగుతున్నాయి. నలంద జిల్లాలోని బిహార్ షరీఫ్ పట్టణంలోని ఒక పరీక్షహాల్లో విషాదం చోటుచేసుకుంది.

స్ధానికంగా పదో తరగతి చదువుతున్న రోహిత్ కుమార్ అనే విద్యార్ధి కూడా పదో తరగతి పరీక్షలు ఆదర్శ్ ఉన్నత పాఠశాలలో రాస్తున్నాడు.  కానీ అతను కొన్ని రోజులుగా ఆస్త్మా, జ్వరంతో బాధ పడుతున్నాడు. ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లితండ్రులు రెస్ట్ తీసుకుని మందులు వేసుకోమని చెప్పినా వినకుండా పరీక్షలు రాస్తానని పట్టుబట్టాడు.

ఇప్పుడు పరీక్షలు రాయకపోతే విద్యా సంవత్సరం నష్టపోతాననే భయంతో పరీక్ష రాయటానికి వెళ్లాడు. విద్యార్ధిని చూసిన ఇన్విజిలేటర్ జ్వరంతో బాధపడుతున్నావు అని చెప్పి పరీక్ష రాయటానికి అనుమతించలేదు. వారిని బతిమలాడాడు. విద్యార్ధి పట్టుదల చూసి నలుగురితో కలవకుండా విడిగా కుర్చోపెట్టి పరీక్ష రాయించటానికి అంగీకరిచారు ఉపాధ్యాయులు.

ఒక ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో రోహిత్ కుమార్ ను విడిగా కూర్చో పెట్టి పరీక్ష రాయించసాగారు. శుక్రవారం ఫిబ్రవరి 19న పరీక్ష  రాయటానికి స్కూల్ కు వచ్చాడు రోహిత్ కుమార్. పరీక్ష రాస్తుండగా మధ్యలో రోహిత్ కుమార్ ఆరోగ్యం విషమించింది. చేతిలో పెన్ను, పేపరు పుచ్చుకునే తుదిశ్వాస విడిచాడు.

పాఠశాల సిబ్బంది రోహిత్ ను ఆస్పత్రికి  తీసుకువెళ్లగా అప్పటికే రోహిత్ కుమార్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పాఠశాలలో విషాధఛాయలు అలుముకున్నాయి. చదువుమీద ఇంట్రెస్ట్ తో ఈ సంవత్సరం బోర్డు పరీక్ష పాసైతే ఇంక పై  చదువులకు వెళ్లోచ్చు అనే ఉత్సాహంతో పాపం  ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  కాగా… శుక్రవారం జరిగిన సోషల్ సైన్స్ పేపరు లీక్ అవటంతో ఆ పరీక్షను మార్చి 8వ తేదీన మళ్లీ నిర్వహించ నున్నారు.