Kerala Women: కేరళలో నరబలి.. గొంతుకోసి ఇద్దరు మహిళల దారుణ హత్య.. డబ్బు కోసం భార్యాభర్తల దురాగతం
కేరళలో అమానుష సంఘటన జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మి భార్యాభర్తలు, ఇద్దరు మహిళల్ని అత్యంత పాశవికంగా హత్య చేశారు. గొంతు కోసి చంపి, ముక్కలు, ముక్కలుగా నరికారు.
- Narender Thiru
- Published On : October 11, 2022 / 03:59 PM IST
Kerala Women: కేరళలో దారుణం వెలుగు చూసింది. నరబలి పేరుతో ఇద్దరు మహిళల్ని అత్యంత పాశవికంగా హతమార్చింది ఒక జంట. నరబలి ఇస్తే అధిక సంపద వస్తుందన్న ఆశతో భార్యాభర్తలిద్దరూ ఈ దురాగతానికి పాల్పడ్డారు.
Hindu Girl: పాక్లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ, కోచి పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలంతూర్ అనే గ్రామానికి చెందిన భగవంత్ సింగ్-లైలా అనే దంపతులకు కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. వీటి నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వారికి రషీద్ అలియాస్.. ముహమ్మద్ షఫీ అనే ఒక ఏజెంట్ తగిలాడు. నరబలి ఇస్తే వాళ్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించాడు. ఇద్దరు మహిళల్ని నరబలి ఇవ్వాలని సూచించాడు. దీంతో అతడు గత జూన్లో రోస్లి అనే మహిళను కిడ్నాప్ చేశాడు. తర్వాత భగవంత్ సింగ్ తన ఇంట్లోనే పూజలు నిర్వహించి, నరబలి పేరుతో రోస్లిని గొంతు కోసి హత్య చేశారు.
తర్వాత గత సెప్టెంబర్లో పద్మ అనే మరో మహిళను కిడ్నాప్ చేశారు. ఆమెను కూడా అదే ఇంట్లో అలాగే హత్య చేశారు. రెండు సందర్భాల్లో వారి మృతదేహాల్ని ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి మహిళల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి విషయంలోనూ కిడ్నాప్ కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ కేసును లోతుగా విచారించగా, విషయం వెలుగులోకి వచ్చింది. నరబలి ఇచ్చిన భార్యాభర్తల్ని, వారికి సహకరించిన ఏజెంట్ను పోలీసులు అరెస్టు చేశారు.
