Uttar Pradesh: తండ్రితో కలిసి భార్యను చంపిన డాక్టర్.. 400 కిలోమీటర్ల దూరంలో రహస్యంగా అంత్యక్రియలు
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్యను హత్య చేశాడు భర్త. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా భార్య మృతదేహాన్ని 400 కిలోమీటర్లు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు.
- Narender Thiru
- Published On : December 14, 2022 / 03:35 PM IST
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్లో ఒక డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యను హత్య చేసి, ఆపై 400 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, లఖింపూర్ ఖేరి పరిధిలో గత నవంబర్ 26న జరిగింది. అభిషేక్ అవస్థి-వందన అవస్థి భార్యాభర్తలూ.
Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు
2014లో పెళ్ళి చేసుకున్న ఇద్దరూ ఆయుర్వేద డాక్టర్లుగా పని చేస్తున్నారు. వీళ్లు తమ సొంత ఆస్పత్రిలోనే పని చేసేవాళ్లు. అయితే, ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో వందన వేరే చోట పనిచేసేది. ఈ క్రమంలో నవంబర్ 26న కూడా వీరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెద్దది కావడంతో అభిషేక్ వందనపై దాడి చేశాడు. ఈ ఘటనలో వందన తలకు గాయమై అక్కడికక్కడే మరణించింది. అప్పుడు అభిషేక్ తండ్రి సలహా మేరకు అంబులెన్స్ రప్పించాడు. ఆమె మృతదేహాన్ని 400 కిలోమీటర్ల దూరంలోని గర్ముక్తేశ్వర్ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించిందని అంబులెన్స్ డ్రైవర్ను నమ్మించారు.
పైగా అభిషేక్ డాక్టరే కావడంతో వాళ్ల పని చాలా సులభమైంది. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. అభిషేక్పై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అతడు తన నేరాన్ని అంగీకరించాడు. ఈ హత్యలో తన తండ్రి కూడా సహకరించినట్లు చెప్పాడు. దీంతో నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
